Old Man Died In Ambulance కేరళ కోజికోడ్లో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకున్నాక అరగంటపాటు డోర్ ఓపెన్ కాలేదు. దింతో ఆ వాహనంలోనే క్షతగాత్రుడు మరణించాడు.
అసలేం జరిగిందంటే.. ద్విచక్రవాహన ప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధుడ్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్నాక అంబులెన్స్ డోర్ తెరచుకోలేదు. దీంతో సకాలంలో చికిత్స అందక కోయమోన్(66) ఆస్పత్రి వద్దే మరణించాడు. మృతుడు ఫిరోక్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఈ హృదయవిదారక ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయమోన్ అనే వృద్ధుడిని సోమవారం మధ్యాహ్నం బైక్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడ్ని బీచ్ ఆసుపత్రికి అంబులెన్స్లో తీసుకొచ్చారు. ఆసుపత్రికి చేరుకున్నాక 30 నిమిషాల పాటు అంబులెన్స్ డోర్ తెరచుకోలేదు. డ్రైవర్, సహాయకుడు డోర్ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలతో ఉన్న కోయమోన్.. అంబులెన్స్లో కొన ఊపిరితో నరకం చూశాడు.
మృతిస్థానికులు అంబులెన్స్ కిటికీల అద్దాలను బద్దలగొట్టి కోయమోన్ను బయటకు తీశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వ్యవహారంపై రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.