ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 13 కి.మీ. ఈత కొట్టినవాణ్ణి ఏమనాలి? మీ ఇష్టం. గజ ఈతగాడు అంటారో, మరేమంటారో మాకనవసరం. కానీ, ఓ యువకుడు 13 కి.మీ. ఈతకొట్టి తీరానికి చేరుకుంటే అతణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేంటీ… అంటారా? అదంతే…!
అసలు జరిగిందేంటంటే, శ్రీలంకలోని తలైమన్నారుకు చెందిన హసాన్ ఖాన్ అలియాస్ అజయ్ అలియాస్ ఖాన్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి బోటులో తమిళనాడుకు వెళ్లేందుకు బయల్దేరాడు. తీరానికి ఓ 13 కి.మీ.ల దూరంలో వుండగా సముద్రంలో దూకేశాడు. అలా సరదాగా ఈత కొడుతూ రామేశ్వరానికి చేరుకున్నాడు. అయితే, రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పలేదు. అన్న సామెత మనవాడి విషయంలో నిజమైంది. రామ… రామ… పోలీసుల్ని శనేశ్వరం అనడం లేదు. కానీ అతగాడి దృష్టిలో అంతేగా…! తీరా తీరానికి చేరుకోగానే కోస్ట్ గార్డ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంతాజేసి అతడిని పోలీసులు అరెస్టు చేయడానికి కారణమేంటంటే మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. కోస్ట్ గార్డ్ అధికారులు అతడి నుండి గడువు ముగిసిన పాస్పోర్టును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. వారితో పాటు మరో వ్యక్తి కూడా వచ్చాడనీ, అందరినీ రామనాథపురం జిల్లా మండపం క్యాంపునకు తరలించామనీ అధికారులు తెలిపారు. అన్నట్టు మీకు ‘మన్మధుడు’ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ గుర్తుందిగా… ‘బాగా ఆడాడు గదూ…!’. దాన్ని మనం కాస్త మార్చుకుని ‘బాగా ఆడాడు, భలే దొరికిపోయాడు.’ అనుకోవాలి.