ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మనకు 90 సీట్లు పక్కా అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఇప్పటికి నలభై, యాభై సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయని పేర్కొన్నారు. ప్రజలతో, పార్టీ క్యాడర్తో మమేకమయ్యేవారికి ఎప్పుడూ ఢోకా ఉండదని అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో ఆయన అనేక అంశాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
‘మనం గతంలోనూ పెద్దగా మార్చుకోలేదు. మార్చటం నాకు ఇష్టం ఉండదు. అలాగని గిట్లనే ఉంటం అంటే కుదరదు. ఏం చేసినా సరే అంటే కూడా చెల్లదు కదా! తప్పదంటే ఓ నాలుగైదు మార్చాల్సి వస్తదేమో.. ఈ టైంల అన్నీ సరిచేసుకోవాలి. జాగ్రత్తగా నడుచుకోవాలి’ అని ఆయన ప్రజాప్రతినిధులకు చెప్పినట్టు తెలిసింది. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పార్టీ క్యాడర్తో నిత్యం సత్సంబంధాలు కొనసాగించాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారని సమాచారం.
మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ విధానమని, అయితే ఆ విషయాలను ఎక్కువ ఆలోచించకుండా విశాల ప్రజాప్రయోజనాల కోసం పనిచేస్తున్నామనే స్పృహతో వ్యవహరించాలని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యేకు తమ నియోజకర్గ భౌగోళిక, సామాజిక స్వరూపంపై, ఎంతమందికి సంక్షేమ పథకాలు అందాయనే అంశంపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి మనసుల్లో ‘మనం మాత్రమే’ చేయగలిగాం అని ముద్రపడేలా ఒకటికి పదిసార్లు చెప్పాలని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. అవసరమైతే పథకాల వారీగా లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు చేయాలని చెప్పారని తెలిసింది.