Rains : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరుజిల్లాలో పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అదే విధంగా రాబోయే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని ఆయన తెలిపారు. అల్లూరి సీతరామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, నంద్యాల,అనంతపురం జిల్లాల్లో 2 వ తేదీన అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
కాగా 3 వ తేదీన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, వైయస్సార్, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు తగు సహాయక చర్యలు చేపడుతున్నారు. అలానే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా వందల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయినట్లు తెలుస్తుంది

























