మానవత్వం మంట గలసిపోయింది. మనిషన్నవాడు మాయమైపోతున్నాడు. క్షణికావేశంలో వావి వరసలూ, మానవత్వం మరచి రెప్పపాటులో నిండు ప్రాణాల్ని గాల్లో కలిపేస్తున్నారు. కోపానికి హద్దులు చెరిగిపోతున్నాయా? అవుననే చెప్తున్నాయి నిత్యం మన సమాజంలో జరుగుతున్న అనేకానేక సంఘటనలు. ‘అలా జరిగిందా?’ అనుకునేలోపు ‘అంతకంటే ఎక్కువ జరిగింది.’ అనుకోవాల్సిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిరక్షరాస్యతవల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని కొందరు అంటున్నప్పటికీ అమెరికాలాంటి అగ్ర దేశాల్లో సాక్షాత్తూ విశ్వ విద్యాలయాల ప్రాంగణాల్లో విద్యార్థులే కాల్పులకు పాల్పడడం విస్మయానికి గురి చేసే సంఘటనలు.
ఇకపోతే, మన దేశంలో నిత్యం వావి వరసలు మరచి ఎవరిని పడితే వారిని అత్యాచారం చేసే కిరాతకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూంటే ఏకంగా ప్రాణాలు తీసేవారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన మానవ సమాజాన్నే వెక్కిరించే స్థాయిలో వుందంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.
ఉత్తరప్రదేశ్ లోని షామ్లీలో ఈ ఘటన జరిగింది. 33 ఏళ్ల ఉమర్దీన్ అనే వ్యక్తి భోజనం చేస్తుండగా ఐదేళ్ల వయసుగల మేనకోడలు ఖైరూ నిషా అక్కడికి వచ్చి మామిడికాయ కావాలంటూ అతడిని పదేపదే అడిగింది. దీంతో, తీవ్ర అసహనానికి లోనైన ఉమర్దీన్ ఓ రాడ్ తీసుకుని ఆ చిన్నారి తలపై కొట్టాడు. ఆపై పదునైన వస్తువుతో గొంతుకోశాడు. దాంతో తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక మృతి చెందింది.
ఆ చిన్నారి మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కుక్కాడు. కాగా, తమ కుమార్తె కనిపించకపోవడంతో ఖైరూ నిషా తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు. ఉమర్దీన్ కూడా ఏమీ ఎరగనివాడిలా గ్రామస్తులతో పాటే బాలిక కోసం వెదికాడు. అయితే, పోలీసులు అతడిని అనుమానించడంతో పారిపోయాడు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. ఎట్టకేలకు నిందితుడ్ని గురువారం రాత్రి ఓ అటవీప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి హత్యకు ఉపయోగించిన ఓ ఐరన్ రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడు మానవత్వం మంటగలసిపోయిందనిపించక మానదు. ఒళ్లు గగుర్పొడుస్తుంది, సమాజం ఎటు పోతోందనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇలాంటి సంఘటనలు మటుమాయమై మంచి సమాజం నెలకొనాలని కోరుకోవడం అత్యాశే అయినా కోరుకుందాం…!!