Political రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పండుగ వచ్చింది అంటే చాలు ప్రత్యేక ఛార్జీల పేరుతో ప్రయాణీకుల జేబు గుల్ల కావాల్సిందే. అప్పటి వరకు ఉన్న ఛార్జ్కు రెండింతలు చెల్లించి ప్రయాణాలు చేయాల్సిన దుస్థితి. ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రమే కాదు… టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ ఇదే పరిస్థితి. సాధారణ రోజులతో పోల్చేతే ఆయా రోజుల్లో 50% వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
ఈసారి దసరాకు ఎలాంటి ప్రత్యేక ఛార్జ్లు వసూలు చేయడం లేదంటూ… ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు మంచి వార్త చెప్పింది. దసరాకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ తమ ఊర్లకు ఆనందంగా వెళ్లి రావచ్చని శుభవార్త చెప్పింది. అదనపు చార్జీల వసూలుకు స్వస్తి చెప్పినట్టు తెలిపింది. అలాగే ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య 1,081 అదనపు సర్వీసులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సర్వీసుల్ని సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10 వరకు కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని వెల్లడించింది. ఈ బస్సుల వివరాలను తన అధికారిక వెబ్సైట్లో విడుదల చేయడంతో పాటు రిజర్వేషన్లకు అనుమతిచ్చింది.
దసరా సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఈ రూట్ లలో తిరగనున్నాయి… విజయవాడ టూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.… విజయవాడ టూ విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడ… విజయవాడ టూ తిరుపతి, రాయలసీమ జిల్లాలు… విజయవాడ టూ అమలాపురం, భద్రాచలం ప్రాంతాలకు నడపనుంది.