వినోద్ కుమార్ తో భేటీ అయిన ఆల్ ఫర్ ఎనిమల్ ఫౌండేషన్, ఎనిమల్ బ్లడ్ లైన్ ఎన్జీవో సంస్థల ఫౌండర్స్
మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని జంతువుల కోసం బ్లడ్ బ్యాంక్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
శనివారం మంత్రుల నివాసంలో ఆల్ ఫర్ ఎనిమల్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీలక్ష్మి భూపాల్, ఎనిమల్ బ్లడ్ లైన్ ఫౌండర్ శివ కుమార్ వర్మ లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జంతువుల పట్ల ప్రభుత్వ పరంగా ఎన్జీవో సంస్థలకు అందజేయాల్సిన చేయూత గురించి చర్చించారు.
ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు వంటి అనేక జంతువులకు రక్తహీనత ఏర్పడినప్పుడు గాని, ప్రమాదాల్లో రక్తస్రావం జరిగినప్పుడు గాని వాటికి రక్తం లభ్యం కానందువల్ల జంతువులకు ప్రాణాపాయం జరుగుతోందని శ్రీలక్ష్మి భూపాల్, శివ శివ కుమార్ వర్మ వివరించారు. అమెరికా, యూ.కే. దేశాలలోని ఎనిమల్ ఫౌండేషన్లు జంతువుల బ్లడ్ బ్యాంక్ ల నిర్వహణ నైపుణ్యాన్ని, అవసరమైన ల్యాబ్ సామాగ్రిని అందించేందుకు, శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని వారు తెలిపారు.
హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ లో ఉన్న పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో జంతువుల బ్లడ్ బ్యాంక్ సహా జంతువుల ఆరోగ్య పరిరక్షణ కోసం బ్లడ్ రిసెర్చ్ సెంటర్ ను నెలకొల్పే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళ్తానని వినోద్ కుమార్ వారికి తెలిపారు.
ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హ, వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రవీందర్ రెడ్డి లతో వినోద్ కుమార్ మాట్లాడారు. ఈ సంస్థల ఫౌండర్స్ కూడా వారితో భేటీ అయ్యారు. మూగజీవాల సంరక్షణ కోసం అంకితభావంతో, నిస్వార్థంగా కృషి చేస్తున్న శ్రీలక్ష్మీ భూపాల్, శివ కుమార్ వర్మ లను ఈ సందర్భంగా వినోద్ కుమార్ అభినందించారు.