కన్న కొడుకునే కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులను స్థానికులు అడ్డుకున్న ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాలుడు పెద్దగా అరుస్తూ.. తల్లిదండ్రులతో గొడవకు దిగడంతో వారు పిల్లల్ని దొంగిలించేవారేనని అనుకొని పోలీసులకు పట్టించారు. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం తెలిసింది.
వడోదవరకు చెందిన భార్యభర్తలు తమ 5 సంవత్సరాల కొడుకుతో కలిసి వ్యాన్లో ఎక్కడికో బయలుదేరారు. ఇక్కడి నవపురాలోని ఓ మార్కెట్లో వారి వ్యాన్ ఆగింది. ఇక అప్పుడు వారి కొడుకు పెద్దగా అరుస్తూ.. ఏడ్చాడు. తల్లిదండ్రులతో గొడవ చేస్తున్నాడు. ఇదంతా గమనించిన మార్కెట్లోని కొందరు వారిని చుట్టుముట్టారు. బాలుడిని దొంగతనం చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. వారు బాబు మా సొంత కొడుకు అని ఎంత చెప్పినా స్థానికులు నమ్మలేదు. బాబును ప్రశ్నిద్దామంటే ఆ బాలుడు బధిరుడు..సరిగా మాట్లాడలేదు. ఇక అక్కడికి ఎక్కువ సంఖ్యలో జనాలు చేరుకున్నారు. వారు ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరిగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని విచారించారు. ఇక వారింటికి వెళ్లి సరైన ఆధారాలు చూపించగా వారే తల్లిదండ్రులను నమ్మారు. బిడ్డను అప్పగించారు.