Chandra Babu : 2024 ఎన్నికలకు పార్టీలు అన్నీ సమాయత్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ బలాలను పెంపొందించుకునేందుకు సిద్దమవుతూ ప్రణాళికలు రూపొందిచుకుంటున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో దూకుడు పెంచారు బాబు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితిపై పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తో కలిసి సమీక్షించారు.
2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని చంద్రబాబు దృష్టికి తెచ్చారు లోకేశ్. గత ఓటమిని పట్టించుకోకుండా అందరిని సమన్వయం చేసుకుంటూ అత్యధిక మెజారిటీతో గెలవాలని సూచించారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్ర తిరగరాసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఈ మేరకు పార్టీ నిర్వహించిన సర్వేలో తేలిన అంశాలపై ఇద్దరూ చర్చించారని సమాచారం. 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓటు బ్యాంకు స్థిరంగా ఉందా లేదా అన్న అంశంపై ఆరా తీశారు.
అలానే ఇటీవల కాలంలో కొంతమంది నేతలు టీడీపీ వీడి వైసీపీలో చేరిన తర్వాత నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని లోకేశ్ కు సూచించారు. గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో అలసత్వం లేకుండా నాయకులంతా సమష్టిగా పని చేయాలని చంద్రబాబు తెలిపినట్లు సమాచారం అందుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో 1983, 1985 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. మరి ఈసారి లోకేశ్ చరిత్రను తిరగ రాస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే…