Viral News : ప్రస్తుత భారత్లోని ఏ అడవుల్లో, జూల్లోనూ చీతాలుగా పిలిచి పులి జాతి లేదు. దేశంలో 1948లోనే వీటి జాతి అంతమైంది. అంటే దాదాపు 74 ఏళ్ల క్రితమే వీటి ఉనికి దేశంలో మాయమైంది. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్… ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా మరణించింది. ఆ తర్వాత వీటి ఆనవాళ్ల దేశంలో కనుమరుగయ్యాయి. ఈ కారణంగానే 1952లో భారత్లో చీతాలను అంతరించిన జాతిగా ప్రభుత్వం ప్రకటించింది.
ఇన్నాళ్లకు… అంటే దాదాపు 74 ఏళ్ల తర్వాత… చీతాలు భారత్లో అడుగు పెట్టనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, వన్యప్రాణుల సంరక్షకుల కృషి ఫలితంగా… నమీబియా దేశం నుంచి 8 చీతాలు భారత్లోకి రాబోతున్నాయి. వీటిలో అయిదు ఆడ, మూడు మగ చీతాలు ఉండనున్నాయి. ఆదేశం నుంచి ఈ చీతాలను తరలించేందుకు బి747 జంబోజెట్ విమానాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో నమీబియా నుంచి 16 గంటల పాటు ప్రయాణించి సెప్టెంబర్ 17న దేశంలోకి అడుగు పెట్టబోతున్నాయి.
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఇప్పటికే ఈ చీతాలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న ఈ చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కునో పార్కులోకి విడిచిపెటనున్నారు… అదే రోజు ప్రధాని పుట్టినరోజు కావడం విశేషం. భారత్కు తీసుకువస్తున్న చీతాలకు ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసి ఐసోలేషన్లో ఉంచారు. ఆరోగ్యం, క్రూరత్వం, వేటాడే నైపుణ్యాలు, భవిష్యత్తులో వాటి సంతతిని పెంచగల జన్యు సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని 8 చీతాలను భారత్ కోసమే ప్రత్యేకంగా ఎంపిక చేశారు.