మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఎప్పుడో 1984వ సంవత్సరంలో జరిగిన విపత్తు ఇప్పటికీ దేశవ్యాప్తంగా అందరికీ గుర్తుండిపోయింది. భోపాల్ అనగానే గ్యాస్ లీక్ అనే గుర్తొస్తుంది. అప్పుడు నగరంలోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో విషవాయువులు లీక్ కావడం, ఆ వాయువును పీల్చి వేలాదిమంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది ఇప్పటికీ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అయితే, తాజాగా మరోసారి భోపాల్ లో విషవాయువుల లీక్ కలకలం సృష్టించింది.
నగరంలోని ఓ నీటి శుద్ధి కేంద్రంలో గ్యాస్ లీక్ అయింది. దానికి మరమ్మత్తులు చేస్తుండగానే మరోసారి లీక్ కావడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న పదిహేనుమంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అర్ధగంటలోనే లీకేజీని అరికట్టామని అధికారులు వెల్లడించారు. కాగా, భోపాల్ లోని మదర్ ఇండియా కాలనీలో నీటి శుద్ధి కేంద్రం ఉంది. బుధవారం మధ్యాహ్నం ఇందులో నుంచి క్లోరిన్ వాయువు లీక్ అయ్యింది. ఈ వాయువు పీల్చిన చుట్టుపక్కల జనం దగ్గు, ఆయాసంతో బాధపడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. అప్పటికే స్థానికులలో పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు చిన్నారులు స్పృహ కోల్పోయారు. అధికారులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
లీకేజీని అరికట్టడానికి మరమ్మతులు చేస్తుండగానే మరోసారి క్లోరిన్ లీక్ అయ్యింది. దీంతో మదర్ ఇండియా కాలనీ వాసుల్లో భయాందోళన వ్యక్తమైంది. అయితే, కాసేపటికే మరమ్మతులు పూర్తిచేసి లీకేజీని అడ్డుకున్నామని అధికారులు ప్రకటించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని స్థానికులకు భరోసా ఇచ్చారు. ఏదేమైనా, మళ్లీ మళ్లీ ఇలాంటి సంఘటనలు జగరకుండా అరికట్టాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వం, రసాయనిక కర్మాగారాల యజమానులపై వుంది.