మనుషుల్లో మానవత్వమనేది ఎప్పుడో చచ్చిపోయింది. సాటి మనుషులనే మట్టుబెట్టే మనిషి పశు పక్ష్యాదుల పట్ల కనికరం చూపిస్తాడా… కోళ్లనీ, మేకల్నీ, గొర్రెల్నీ కోసుకు తినడం ఇప్పుడు చాలా చిన్న విషయం. తమ మానాన తాము అడవిలో తిరుగుతున్న ఏనుగుల్ని మట్టుబెట్టి వాటి చర్మాల్నీ, దంతాల్నీ అమ్ముకునే స్థాయికి మనుషులు ఎప్పుడో వెళ్లిపోయారు. సరదాగా జింకల్ని వేటాడి చంపే వినోదానికి ఎగబడుతున్నారు. ఈ క్రమంలో ఒక ఏనుగు మనుషులను అసహించుకుందా అన్న ఆలోచనను రేకెత్తించే సంఘటన ఒకటి జరిగింది.
ఓ పార్కులో తన బిడ్డతో కలసి తల్లి ఏనుగు రోడ్డు దాటుతూండగా కొంత దూరంలో కనిపించిన సందర్శకుల వద్దకు వెళ్లబోయింది పిల్ల ఏనుగు. ఇది చూసి తల్లి ఏనుగు తన బిడ్డను వారించి తనతోబాటు తీసుకెళ్లిపోయింది. ఇది కేవలం తన బిడ్డపై చూపిన ప్రేమకు నిదర్శనం మాత్రమే కాదు, మనుషులపట్ల చూపిన అసహ్యానికి కూడా నిదర్శనమనే భావనకొచ్చారు నెటిజన్లు. ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే 1.5 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
ఇది ఎక్కడ జరిగిందో తెలీదు గానీ నెటిజన్లు మాత్రం చాలా బాధగా స్పందిస్తున్నారు. మనుషులను చూస్తే జంతువులు భయపడిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వేటాడ్డం, క్రూరంగా ప్రవర్తించడమే ఇందుకు కారణమంటున్నారు. నిజమే… మనం మారాలి. ఏదో గొప్పోళ్లమైపోవలసిన అవసరం లేదు. మనుషులం మళ్లీ మనుషులుగా మారాలి.