Crime కొన్నాళ్లుగా దేశంలోవివిధ రూపాల్లో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను పట్టుకుంటున్న పోలీసులు… ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్ గుట్టును పట్టుకున్నారు. ఇప్పటికే వివిధ కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంలో ముంబయి తీరంలోని ఓ పోర్ట్లో వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ను అదుపులోకి తీసుకున్నారు. ఊపిరితిత్తులు, కాలేయం సహా.. వివిధ వ్యాధులను నివారించేందుకు ఆయుర్వేదంలో ప్రముఖంగా వినియోగించే లికోరైస్-అతిమధురంగా పిలిచే మూలికకు హెరాయిన్ను పూతగా పూసి అక్రమంగా తరలిస్తుండగా…. దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు పట్టుకున్నారు.
ఇటీవల మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు అఫ్గాన్ దేశస్థులను అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో నిషేధిత మెథాంఫేటమిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వారిని విచారిస్తుండగానే… ముంబయి తీరంలో ఓ కంటైనర్లోనూ పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో దిల్లీ పోలీసులు ముంబయి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.
ముంబయిలోని నవషెరా పోర్ట్లో ఉన్న ఓ కంటైనర్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.… అందులో హెరాయిన్ పూతతో ఉన్న అతిమధురాన్ని గుర్తించారు. ఈ కేసులో దాదాపు 22 టన్నుల హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో దీని విలువ రూ.1,725 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.