స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా రెండు వారాల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నేడు (ఆగస్టు 10) రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో వనమహోత్సవం
ఘనంగా జరిగింది. స్వతంత్ర సమరయోధుడు భాగ్య రెడ్డి వర్మ కుటుంబ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని అందరూ కలిసి 75 మొక్కలను పార్కు ఖాళీ స్థలంలో నాటారు. తెలంగాణ ప్రభుత్వం రెండు వారాల పాటు నిర్వహిస్తున్న వజ్రోత్సవాలు దేశ సార్వభౌమాధికారానికి, రాష్ట్ర ఎనిమిదేళ్ళ ప్రగతికి ప్రతీకలుగా నిలుస్తాయని కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ. శాంతి కుమారి అన్నారు. భాగ్య రెడ్డి వర్మ కుటుంబ సభ్యులతో కలిసి వనమహోత్సవంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు.
భాగ్యరెడ్డి వర్మ మనమడు అజయ్ గౌతమ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సమరయోధుల కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని, ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణకు హరితహారంతో పాటు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరికీ స్ఫూర్తి దాయకంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ప్రొడక్షన్) ఎం.సీ. పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్ లు ఏ.కే. సిన్హా, సునీతా భగవత్, డీసీఎఫ్ శాంతారామ్, డీఎఫ్ఓ ఏం.జోజి, వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమన్వయ కర్త రాఘవ, శ్రీలతా గౌతమ్, జ్జాన ప్రకాష్, రేణుక, స్వర్ణ కుమారి, సునీల్, కేబీఆర్ పార్కు సిబ్బంది పాల్గొన్నారు.