Crime కుటుంబంలో తలెత్తే ఆర్థిక ఇబ్బందులు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. వీటి నుంచి బయటపడలేక ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి ఓ సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. అప్పుల బాధ భరించలేక ఇద్దరు చిన్నారులతో పాటు తండ్రి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేస్తుంది.
ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజమహేంద్రవరం సమీపంలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురం ప్రాంతంలో నివాసముంటున్న ఫక్కి సత్యేంద్రకుమార్(40) వివిధ వ్యాపారులకు జీఎస్టీ బిల్స్ సంబంధిత పనులు చూసేవారు. అతడికి భార్య స్వాతి, కుమార్తెలు రిషిత(12), హాద్విక(7) ఉన్నారు. భార్య స్వాతి ఆదివారం బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు.
ఇవాళ ఉదయం సత్యేంద్ర తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి రాజవోలు రోడ్డులోని చేపల చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో బాలికలు ఇద్దర్నీ తోసేసి తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సత్యేంద్ర రాసిన ఏడు పేజీల లేఖ పోలీసులకు లభ్యమైంది. తాను కోరుకున్న విధంగా జీవితం లేదని, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి అధికంగా ఉందని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. ఆగస్టులో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పటికీ కుమార్తెలు అనాథలుగా మిగులుతారనే ఉద్దేశంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు అందులో రాసినట్లు సమాచారం.