ఒకనాటి నాయకత్వం చేసిన చిన్న పొరపాటుకు, కొద్దిగా ఒళ్లు మరచిపోయినందుకు బలవంతంగా మనలను ఆంధ్రలో కలిపారు. మళ్లీ మన తెలంగాణ మనం సాధించుకోవడానికి 60 ఏండ్లు కొట్లాడాల్సిన అవసరం పట్టింది. ఎంతో మంది పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. నేను కూడా చివరికి చావు అంచులోకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో దేశంలోని రైతులంతా ఒకటి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. సాగుభూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను వాళ్ల భూముల్లోనే కూలీలుగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కుయుక్తులు పన్నుతున్నదని తెలిపారు. బీజేపీని సాగనంపినప్పుడే దేశం బాగుపడుతుందన్నారు. కేంద్రంలో రాబోయేది బీజేపీయేతర ప్రభుత్వమేనని, అప్పుడు యావత్ దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. దీంతోపాటు జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ మాదిరే యావత్ భారత రైతాంగానికి ఉచిత కరెంటు
ఈ నిజామాబాద్ గడ్డ లక్ష్మీగడ్డ. ఇక్కడి నుంచి భారత రైతాంగ సోదరులకు ఒక తీయటి మాట అందిస్తున్న. మోదీ ఎన్పీఏల కింద పెద్ద పెద్ద గద్దలకు దోచిపెట్టిన దేశ సంపద రూ.12 లక్షల కోట్లు. మొత్తం భారతదేశంలో రైతులందరూ కలిసి ఇరిగేషన్ కోసం వాడుకొనే కరెంటు కేవలం 20.8%. దాని ధర 1.45 లక్షల కోట్లు మాత్రమే. బ్యాంకులు లూటీ చేసినవాళ్ల నుంచి కమీషన్లు తీసుకుని 12 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీకి రైతులకు 1.45 లక్షల కోట్లు ఇవ్వడానికి చేతులు వస్తలేవా? 2024 లోక్సభ ఎన్నికల తరువాత దేశంలో ఎగిరేది నాన్ బీజేపీ జెండానే. దిక్కుమాలిన, రైతుల, కార్మికుల, పేదల వ్యతిరేక బీజేపీని సాగనంపడం, ఢిల్లీ గద్దె మీద మన ప్రభుత్వం రావడం ఖాయం.
బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. తెలంగాణ మాదిరిగానే యావత్ భారత రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తాం. ఈ విషయాన్ని నిజామాబాద్ గడ్డ మీదినుంచి ప్రకటిస్తున్న. దేశం కోసం తెలంగాణ నుంచి పోరాటం చేయాలె. ఎవరైతే బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నారో? ఎవరైతే రైతులను ఆత్మహత్యలు చేసుకోమంటున్నరో? రైతుల ఊసురుపోసుకుంటున్నరో? వాళ్లు మన బాయి కాడ మీటరు పెట్టుడు కాదు.. మనందరం ఒక్కటై వాడికే మీటరు పెట్టాలె. అట్లయితేనే బాగుపడతం.
విమానాలు అమ్మిన్రు. ఓడరేవులు అమ్మిన్రు. రైళ్లు అమ్మిన్రు. కార్ఖానాలు అమ్మిన్రు. బ్యాంకులు అమ్మిన్రు. అన్నీ అయిపోయినయ్. ఇక మిగిలింది రైతుల దగ్గరున్న భూమే. ఎరువుల ధర పెంచాలె. డీజిల్ ధర పెంచాలె. దున్నుకానికి ధర పెరగాలె. వరికోతకు ధర పెరగాలె. మన పంటకు ధర ఇయ్యొద్దు. మన వడ్లు కొనొద్దు. కరెంటు మీటర్లు పెట్టాలె. చాతకాక మన ఎవుసం బంద్చేయాలె. ఈ కుట్ర అంతా దేనికోసం జరుగుతున్నది? రైతుల దగ్గర ఉన్న భూములను లాక్కోవాలె. మోదీ దోస్తులకు, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పాలె. అన్ని బిల్లులు పెరిగి, పంటలకు ధరలు రాక మనం నాశనమై పోయి, నా వల్ల కాదు అని చాలించుకోవాలె. అప్పుడు మన భూములు కొనేటందుకు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు సూట్కేసులు వస్తయి. మన భూములను వాళ్లకు ఇచ్చి, ఆండ్లనే కైకిలి జేసుకోవాలె అంటరు. ఇది చాలా ప్రమాదకరమైన కుట్ర. – ముఖ్యమంత్రి కేసీఆర్