Governor Tamilasai : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ… నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఆమె ప్రైవసీని దెబ్బతీయాలని చూస్తున్నారని … ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు తాను పాల్పడలేదని చెప్పారు. ప్రగతి భవన్లా కాకుండా రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తమిళిసై తెలిపారు. ఫామ్ హౌజ్ కేసులోనూ రాజ్భవన్ను లాగాలని చూశారని… అధికారిక ట్విట్టర్ ఖాతాలో డైరెక్ట్గా ఈ విషయాన్ని పెట్టారని తమిళిసై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
గతంలో తుషార్ రాజ్భవన్లో ఏడీసీగా పనిచేశారని… తుషార్ పేరును ఉద్దేశ పూర్వకంగానే తీసుకొచ్చారని విమర్శించారు. ఏ విషయంపై అయినా మాట్లాడేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక్కొక్క బిల్లును సమగ్రంగా పరిశీలిస్తున్నానని… రిక్రూట్మెంట్ బిల్లుపై ప్రభుత్వాన్ని క్లారిఫికేషన్ కోరినట్లు వెల్లడించారు. కానీ తాను రిక్రూట్మెంట్ను అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిందని అన్నారు. కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు అన్నదే నా ప్రశ్న అన్నారు. ఎనిమిదేళ్లుగా అనేక వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ విషయంపై అన్ని యూనివర్సిటీల వీసీలతో మాట్లాడానని తమిళిసై తెలిపారు.
ఆ తర్వాత డీటైల్డ్ రిపోర్ట్ రూపొందించి ప్రభుత్వానికి పంపానన్నారు. కొత్త రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ? యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా ? లీగల్గా ఇబ్బందులు వస్తే ఏంటి పరిస్థితి ? మళ్లీ నియమాకాలు ఉంటాయా ? బోర్డు ఏర్పాటులో ఎలాంటి ప్రోటోకాల్ పాటిస్తారు ? అని వివరణ కోరానని, కానీ, సంబంధిత మంత్రి నుంచి సమాచారం రాలేదని చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని గవర్నర్ తమిళసై తెలిపారు. నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నానని ప్రచారం చేయడం సబబు కాదంటూ గవర్నర్ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.