మన తెలుగు సినిమా ఇప్పుడు తెలుగు సినిమా మాత్రమే కాదు. పాన్ ఇండియా సినిమాగా రూపాంతరం చెందింది. ఆ మాటకొస్తే ప్రపంచ వెండితెరపైన సైతం రాజ్యమేలుతోంది. అందుకే, హీరోలకూ, దర్శకులకూ ప్రపంచవ్యాప్త క్రేజ్ లభిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనూ మన తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందినప్పటికీ ఆ సంఖ్య ఇప్పుడు బాగా పెరిగిందనే చెప్పాలి.
ఇకపోతే, డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ఇటు భారతీయ వెండితెర దృష్టినే కాదు, ప్రపంచ దృష్టిని సైతం విశేషంగా ఆకర్షించారు. ఈ క్రమంలో ఇటీవలే ఆయన తాజా చిత్రం ‘ఆది పురుష్’కు సంబంధించిన టీజర్ విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందులో ఆయన రాముడిగా దర్శనమివ్వడమే అందుకు ప్రధాన కారణం. ఈ టీజర్ విడుదల కార్యక్రమాన్ని కూడా ఉత్తరప్రదేశ్ లోని రామజన్మభూమి అయోధ్యలో నిర్వహించారు.
అయితే, ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఈసారి ఈ వేదికను అయోధ్యలోని రామ మందిర రూపంలో నిర్మాణం గావిస్తున్నారుట. ఈ విజయదశమి సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు డార్లింగ్ ప్రభాస్ కి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమాన్ని ఆయనే ప్రారంభిస్తారని అంటున్నారు. రావణ దహన కార్యక్రమంలో ‘ఆది పురుష్’ చిత్ర దర్శకుడు ఓం రౌత్ కూడా పాల్గొంటారుట. ఇది నిజంగా తెలుగువారమైన మనందరికీ గర్వకారణం గదూ…!!