రోజురోజుకీ మనం వైజ్ఞానికంగా ఎంతో ఎత్తుకి ఎదుగుతున్నాం. సాంకేతికపరంగా ఎన్నెన్నో కొత్త విషయాల్ని తెలుసుకుంటున్నాం, కనిపెడుతున్నాం. కానీ, గులాబీ పక్కనే ముళ్లున్నట్టుగా… అప్పుడప్పుడూ అవాక్కయ్యే చేతు నిజాలు మాత్రం పంటి కింద రాయిలా బాధిస్తాయి. అవే… ఇంకా ఇంకా మనిషిని వెంటాడుతున్న మూఢ నమ్మకాలు. ఇలాంటివి నిరక్షరాస్యతవల్ల జరుగుతున్నాయా, మరేవైనా కారణాలున్నాయా అన్న విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ముక్కున వేలేసుకునేలా చేసే మరో మూఢ నమ్మకం వెలుగులోకి వచ్చింది.
తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్, లైలా భార్యాభర్తలు. ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్న వీరు వాటి నుంచి బయటపడడంతో పాటు సిరిసంపదలు కలుగుతాయన్న ఉద్దేశంతో నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరికి మహ్మద్ షఫీ అనే వ్యక్తి తోడయ్యాడు. అందరూ కలసి నరబలికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలో కడవంతర, కాలడీలకు చెందిన ఇద్దరు మహిళలతో షఫీ సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేశాడు.
పథకంలో భాగంగా సెప్టెంబర్ నెల 26వ తేదీన ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలసి వారిని బలిచ్చాడు. మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. బాధిత మహిళలను లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవించే 52 సంవత్సరాల వయసుగల పద్మ, యాభైయ్యేళ్ల రోస్లీగా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో వారు చెప్పిన విషయాలు విని విస్తుపోయారు. ఆర్థికంగా లాభపడేందుకే నరబలి ఇచ్చినట్టు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. నిండు ప్రాణాలను మూఢ నమ్మకానికి బలివ్వడం నిజంగా బాధాకరమైన విషయం. జంతుబలులు సైతం సరైంది కాదనే కాలంలో వున్న మనం, నరబలుల గురించి వినాల్సి వస్తోంది. ఏదేమైనా పోలీసులూ, పాలకులూ, న్యాయ వ్యవస్థ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.