Politics సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని వెల్లడించారు. తన స్థానంలో ఈ సారి సంగారెడ్డి కార్యక్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. క్యాడర్ వద్దంటే.. తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. మళ్లీ 2028 ఎన్నికట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
”వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. నా స్థానంలో సంగారెడ్డిలోని కార్యకర్త పోటీ చేస్తారు. పార్టీ శ్రేణులు వద్దంటే.. నా భార్య నిర్మల బరిలో ఉంటారు. నేను 2028ఎన్నికల్లో పోటీ చేస్తా” అని అన్నారు. కాగా, ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఈ మధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు. సొంత పార్టీ లో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఆయన నోరెత్తడం లేదు. నెలరోజులకుపైగా గాంధీభవన్కు కూడా రావడం లేదు. దీంతో ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఇక గతకొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ వ్యవహారశైలిపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయనపై బహిరంగంగానే విమర్శలు చేశారు. సీనియర్లకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదనే ఆరోపణలతో కాంగ్రెస్ అధిష్ఠానానికి సైతం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అధిష్ఠానం పెద్దలతోనూ జగ్గారెడ్డి చర్చించారు.