Health ప్రస్తుతం అంతా హడావిడి జీవితాలు… ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అంతా నిముషాల మీద ప్రయాణమే. ఒకటి రెండు అని కాదు.. దాదాపు అన్ని ఉద్యోగాలు చేస్తున్న వారిది ఇదే తీరు. ప్రస్తుత సాంకేతిక యుగంలో చాలా మంది అలసిపోయినా కూడా పనులను పక్కన పెట్టేందుకు తీరిక ఉండడం లేదు. నిద్ర ముంచుకు వస్తున్నా, పని చేసేందుకు ఓపిక లేకున్నా… తప్పనిసరి పరిస్థితుల్లో పనుల్లో నిమగ్నమవుతున్నారు. కానీ… ఇలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నాయి… కొన్ని అధ్యయనాలు.
పని మధ్యలో కాస్త విరామం అనేది లేకుండా పని చేయడం వల్ల మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం విష రసాయనాలను విడుదల చేస్తుందని గుర్తించారు… నిపుణులు. శాస్త్రీయంగానే కాదు… అలసటగా ఉన్నప్పుడు నిర్ణయాలు సరిగా తీసుకోలేము అని అందరికీ తెలిసిన విషయమే. పారిస్లోని పిటీ-సల్పెట్రీయర్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్న దాన్ని బట్టి అలసట అనేది ఒక రకమైన భ్రమ అని, విశ్రాంతి తీసుకునేందుకు మెదడు పంపించే సంకేతమే అలసిపోవడం అంటున్నారు.
దాంతో పాటే.. ప్రస్తుత సాఫ్ట్వేర్ ఉద్యోగుల మాదిరిగా శారీరక వ్యాయామం తక్కువగా ఉండే ఉద్యోగాల్లో గంటలకు గంటలు కూర్చోవడం వల్ల గుండె సంబంధ జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందంట. ఇలా కాస్త విశ్రాంతి, శారీరక అలసట లేకుండా కూర్చోవడం వల్ల 5.8 % మందిలో గుండె జబ్బులొస్తున్నాయి. వీరిలో 8.8 % మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడైంది. అందుకే ఎక్కువ సేపు కూర్చోకుండా… పని మధ్యలో కాసేపు నడవాలి అని సూచిస్తున్నారు…. వైద్యులు. ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలను నివారిస్తుందంటున్నారు. మొత్తంగా 8 గంటలు కూర్చొని పనిచేస్తే గుండె జబ్బులొస్తాయన్న సంగతిని మర్చిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.