Health తేనెను ఇప్పుడే కాదు… మన పూర్వికులు వేల ఏళ్లుగా వినియోగిస్తూనే ఉన్నారు. అనేక వ్యాధులను నయం చేసేందుకు ఔషధంగా ఉపయోగపడుతుంది… తేనె. అందుకే… భారతీయ రుషులు అందించిన ఆయుర్వేదంలో తేనెకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రోజూ తేనెను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగడంతో పాటు…. కఫం, ఉబ్బసం, అధిక రక్తపోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. అయితే… ఇన్ని ప్రయోజనాలున్న తేనెను కొన్ని తీరులుగా తీసుకుంటే మాత్రం ప్రమాదమే. ఒక్కోసారి… ఒక్క స్పూన్ తేనె కూడా విషంగా మారొచ్చు. అందుకే పొరపాటున కూడా ఆ తప్పులు చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు.
తేనెను ఎట్టి పరిస్థితుల్లోనూ నెయ్యితో కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే.. నెయ్యిలో శరీరానికి చలవ చేసే గుణాలుంటే… తేనెలో మాత్రం వేడిని ప్రేరేపించే లక్షణాలుంటాయి. ఈ రెండింటి పరస్పర వ్యతిరేక గుణాల కారణంగా కలిపి తీసుకున్న వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. తేనెను ముల్లంగి, కీరాతో కూడా కలిపి తీసుకోకూడదు. లేదా…ఈ రెండింటికి తేనెను జోడించి తినకూడదు. ఎందుకంటే.. కీరా, ముల్లంగి రెండూ చలువ చేసే గుణాల్ని కలిగి ఉంటే తేనె మాత్రం వేడిని కలిగిస్తుంది. అందుకే వద్దంటారు… పెద్దలు. అలానే చాలా మంది సలాడ్లో తేనె కలుపుకుని తింటుంటారు. ఇలా చేయడం వల్ల కడుపుపై ప్రభావం పడి… ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురు అవుతాయంటున్నారు… ఆరోగ్య నిపుణులు.చాలా మంది రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకునే వేడి పాలు లేదా వేడి నీళ్లలో తేనె కలపుకుని తాగుతుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఇక బయట చాలా మంది వేడివేడి టీలో తేనె కలిపి సేవిస్తుంటారు. ఇది మంచిది కాదంటున్నారు. ఇలా చేయడం వల్ల తేనె గుణాల్ని కోల్పోవడమే కాక…ఆరోగ్యానికి హాని కలగజేస్తుందని తెలుపుతున్నారు.