Vishal : హీరో విశాల్ పెళ్లి మ్యాటర్ కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. ఆయన పెళ్లిపై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో వరలక్ష్మీ శరత్ కుమార్తో పెళ్లి అన్నారు. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినయతో పెళ్లి ఫిక్స్ అన్నారు. ఇక ఇంకో నటి ఆ జాబితాలో చేరింది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లక్ష్మీ మీనన్తో విశాల్ పెళ్లి సెటిల్ అయ్యిందని అందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయని ప్రస్తుతం ఇద్దరు డేటింగ్లో ఉన్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై విశాల్ రియాక్టయ్యారు. ట్విట్టర్లో వీరి పెళ్లి మ్యాటర్ గురించి విశాల్ ఘాటుగా స్పందించారు.
‘సాధారణంగా తాను ఎలాంటి ఫేక్ న్యూస్ లేదా రూమర్స్కి స్పందించనని.. ఇప్పడు లక్ష్మీ మీనన్తో తన వివాహం గురించి పుకారు వినిపిస్తున్నందున దానిని ఖండిస్తున్నానని విశాల్ ట్వీట్ చేశారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. తను రెస్పాండ్ అవ్వడానికి కారణం తను నటి కావడంతో పాటు ఓ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టడం, ఆమె ఇమేజ్ను డ్యామేజ్ చేయడం సరికాదన్నారు. తన పెళ్లి డేట్, సమయం గురించి ఖచ్చితంగా డీకోడ్ చేసి చెప్పడానికి అది బెర్ముడా ట్రయాంగిల్ కాదని.. సమయం వచ్చినప్పుడు తన పెళ్లి విషయంపై అధికారంగా ప్రకటన చేస్తానని గాడ్ బ్లెస్’.. అంటూ విశాల్ ట్వీట్ చేశారు. విశాల్ ట్వీట్తో లక్ష్మీ మీనన్తో విశాల్ పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లే.
జిగురుతాండ, కుట్టు బుల్లి, పాండియనాడు, నాన్ సికపు మన్మన్, కొంబన్ వంటి సినిమాల్లో నటించిన లక్ష్మీ మీనన్ విజయ్ సేతుపతి ‘రెక్కై’ సినిమాలోనూ నటించారు. వేదాలంలో అజిత్ చెల్లిగా అలరించారు. ప్రస్తుతం ఆమె లారెన్స్ చంద్రముఖి 2 లో నటిస్తున్నారు. విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో నటిస్తున్నారు. సెప్టెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.