యూట్యూబ్ ఛానెల్స్ తీరు బాధాకరం – కొన్ని మీడియా సంస్థల తీరును ఖండించిన జర్నలిస్టు సంఘాలు
ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు స్వేచ్ఛ వొటార్కర్ సంతాప సభ మంగళవారం సోసైటీ కార్యాలయంలో జరిగింది . సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వేచ్చ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ… స్వేచ్ఛ మరణానంతరం సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చాలా బాధ కలిగిస్తున్నాయని అన్నారు. మీడియా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత జీవితంలో చొరబడిన సోషల్ మీడియా స్వేచ్ఛ ను మరోసారి చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పద్దతి ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్వేచ్చ మరణం తన కూతురు చనిపోయినంత బాధగా ఉందన్నారు.
ఆంధ్ర జ్యోతి మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కే. శ్రీనివాస్ మాట్లాడుతూ… స్వేచ్ఛ ఎంతో ధైర్యవంతురాలు కానీ ఇలా చేస్తుందని ఊహించలేదు అని అన్నారు. స్వేచ్చ మరణించిన తరువాత కొన్ని మీడియాలో వస్తున్న కథనాలు అందర్నీ బాధిస్తున్నాయని అన్నారు.
టి. న్యూస్ సీఈఓ, సోసైటి మాజీ కార్యదర్శి శైలేష్ రెడ్డి మాట్లాడుతూ… స్వేచ్ఛ కు ఎలాంటి టాస్క్ ఇచ్చినా ఊహించిన దాని కంటే బాగా పని చేసేదని చెప్పారు. రాజకీయంగ, సామాజికంగా, ఇలా అన్ని రంగాలపై అవగాహన ఉన్న న్యూస్ ప్రెజెంటర్ లలో స్వేచ్ఛ ముందుంటుందని అన్నారు. ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పారు. స్వేచ్చ దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అనే విషయం తనతో సహా చాలా మందికి ఆమె మరణించిన తరువాత తెలిసిందని అన్నారు. ఆమె సొంత టాలెంట్ తోనే ఈ స్థాయికి ఎదిగింది కానీ ఏరోజు కూడా కులం కార్డు వాడుకోలేదని తెలిపారు. ఆమె మరణించిన తరువాత కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో థంభ్ నైల్స్ చూస్తే వ్యక్తి గత జీవితాన్ని ఎత్తి చూపడం సమంజసం కాదని అన్నారు.
జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు మాట్లాడుతూ… స్వేచ్ఛ లేని లోటు ఎవరూ తీర్చలేరని అన్నారు. గడచిన నెల 12వ తేదిన గోపనపల్లిలో జరిగిన ఎంసీ సమావేశంలో స్వేచ్ఛ ఆ రోజంతా సొసైటీ సభ్యులతోనే ఉన్నారని అన్నారు. నాన్ అలాటీస్ కు ఎలాగైనా న్యాయం చేయాలని స్వేచ్ఛ తపన పడిందని అన్నారు. నకిరేకల్ లో ఎమ్మెల్యే గా పోటీ చెయ్యాలని ఉందని కూడా చెప్పారన్నారు. స్వేచ్చ కూతురు కోసం మంచి విద్యను అందించే బాధ్యత సొసైటీ తీసుకోవాలని ఎంసి సభ్యులు కమలాకర చార్య కోరారు.
కోశాధికారి మహేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ… అభ్యుదయ భావాలతో సాగిన స్వేచ్ఛ భవిష్యత్తు ప్రణాళికలు చాలా ఉన్నాయని, కాని తన చెల్లి లాంటి స్వేచ్ఛ అర్దాంతరంగా తనువు చాలించడం జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ కోశాధికారి యోగానంద్ మాట్లాడుతూ స్వేచ్ఛ గురించి మాట్లాడాలంటే సింహాసం కావాలని అన్నారు. చిన్నప్పటి నుంచి స్వేచ్ఛ తనకు బాగా తెలుసని అన్నారు.
యూనియన్ కార్యదర్శి మారుతి సాగర్ మాట్లాడుతూ… స్వేచ్ఛ మరణం తరువాత ఇంకా యూట్యూబ్ ఛానెల్స్ వ్యవహారంలో మార్పు రాకపోతే యూనియన్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
TUWJF యూనియన్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మాట్లాడుతూ… స్వేచ్ఛ మరణానికి కారణమని భావిస్తున్న పూర్ణ చందర్ రావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి రవీంద్ర బాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మి నారాయణ, సంయుక్త కార్యదర్శి భాగ్యలక్ష్మి , మహిళా జర్నలిస్టులు కూడా మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ రావు స్వేచ్ఛ కుమార్తె అరణ్య చదువు కోసం లక్ష రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు.