Politics హైదరాబాద్ రాజ్భవన్లో చిరంజీవి బ్లడ్బ్యాంక్కు 50కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి లైఫ్ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రక్తదాతలకు గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా లైఫ్ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్తో పాటు చిరంజీవి పాల్గొన్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం చిన్నవిషయం కాదని అన్నారు. తాను హౌస్ సర్జన్గా పనిచేస్తున్న సమయంలో రోగులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని రోజులు చూశానని గుర్తుచేసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో సేవ చేస్తు్న్న ప్రముఖ సినీనటుడు చిరంజీవికి ఆమె అభినందనలు తెలిపారు. రాజ్భవన్ తరఫునా రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని.. అవసరమైన వారికి సమయానికి రక్తం అందించేందుకు ఓ యాప్ను రూపొందించామన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా అందులో భాగం కావాలని తమిళిసై కోరారు. అనంతరం చిరంజీవి మాట్లాడారు.
చిరంజీవి మాట్లాడుతూ… 1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని.. ఆ ఘటనలు తనను ఎంతగానో బాధించిందని అన్నారు. తన కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారని.. వారి ప్రేమని నలుగురికి ఉపయోగ పడేలా మార్చాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ను ప్రారంభించామని చెప్పారు. తరచూ 2-3వేల మంది రక్తదానం చేస్తున్నారన్నారు. అలాంటి వారికి ఏదైనా భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో చిరు భద్రత పేరుతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. త్వరలో ఆస్పత్రి కట్టనున్నట్లు చిరంజీవి చెప్పారు. 9.30లక్షల యూనిట్ల రక్తాన్ని ఇప్పటి వరకు సేకరించామని.. దీనిలో 70 శాతం పేదలకు, మిగిలినది ప్రైవేట్ ఆస్పత్రులకు అందజేశామని ఆయన వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య ఇప్పుడు చాలా తక్కువగా ఉందన్నారు. రక్తదానం చేసేవారికి ఈ సందర్భంగా చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.