‘నూటికో, కోటికో పుడతారు ఒక్కరు…’ అన్నారు సినీకవి. అలా పుట్టిన ఒక్కరూ కోటిమందికి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి ఒక మాహాశక్తే… జాతిపిత మహాత్మాగాంధీ. భారతావనిని దాస్యశృంఖలాల నుండి తప్పించేందుకు సల్పిన విశేష కృషిలో ఆయన పోషించిన భూమిక అంతాయింతా కాదు. అందుకే, గాంధీ విగ్రహాలపట్ల గానీ, గాంధీ రూపంపట్ల గానీ, ఆ పేరుపట్లగానీ పొరపాటునో, ఉద్దేశపూర్వకంగానో తప్పుగా ప్రవర్తిస్తే చట్టం, పాలకవర్గాలూ సీరియస్ గా తీసుకుంటాయి.
దేవీ నవరాత్రుల సందర్భంగా గాంధీ పట్ల పొరపాటు చేసింది కోల్కతాలోని అఖిల భారత హిందూ మహాసభ. వీరు నిర్వహించిన దుర్గాపూజలో మహాత్మా గాంధీని మహిషాసురుడిగా చూపించడంపట్ల వివాదం చెలరేగింది. ఓ మండపంలో దుర్గామాత కాళ్ల కింద వున్న మహిషాసురుడికి గాంధీ ముఖాన్ని తగిలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలను అందుకున్న అనంతరం నిర్వాహకులు ముఖాన్ని మార్చారు. అఖిల భారతీయ హిందూ మహాసభ ఫిర్యాదు తర్వాత పోలీసుల సూచనల మేరకు విగ్రహం రూపు రేఖల్ని మార్చారు.
ఈ విషయమై అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామిని ఓ ఆంగ్ల మీడియా సంస్థ సంప్రదించగా ‘మేం గాంధీని నిజమైన అసురుడిగా చూస్తాం. ఆయనే నిజమైన అసురుడు. అందుకే మేం దేవతామూర్తిని ఇలా తయారు చేశాం. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని ప్రమోట్ చేస్తోంది. మేం బలవంతంగా మూర్తిని తొలగించి దానిని మార్చాం. హోం మంత్రిత్వ శాఖ మాపై ఒత్తిడి తీసుకొచ్చింది. గాంధీని అన్ని చోట్ల నుండి తొలగించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులను ముందు ఉంచాలనుకుంటున్నాం.’ అని గోస్వామి అన్నారు.
అయితే, ఈ చర్యను బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ-ఎం, కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. దీనిపై బెంగాల్ హిందూ మహాసభ స్పందించింది. ఇలా చేసింది నిజమైన హిందూ మహా సభ కాదని తెలిపింది.