ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడూ వస్తాడు అన్నట్టుగా ప్రవర్తిస్తూంటారు కొందరు. ఈ మాట అనకపోయినా అన్నట్టుగా ప్రవర్తించాడు స్వామి శ్రద్ధానంద్. ఎవరా శ్రద్ధానంద్? అంటారా, శ్రద్ధగా వినండి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే…! సుదీర్ఘకాలం శిక్ష అనుభవించడం, జైలులో సత్ప్రవర్తన వంటి కారణాలతో సుప్రీంకోర్టు వారిని విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో వారిని విడుదల చేసినట్లే తననూ విడుదల చేయాలంటూ ఓ ఖైదీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన లాయర్ ద్వారా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. గడిచిన 29 ఏళ్లుగా రెమిషన్ కానీ పెరోల్ కానీ లేకుండా ఇన్నేళ్లలో ఒక్క రోజు కూడా బయటకు అడుగుపెట్టకుండా జైలులోనే మగ్గిపోతున్నానని స్వామి శ్రద్ధానంద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మాజీ ప్రధాని సహా పదిహేడు మంది మరణానికి, మరో 43 మంది గాయాలపాలవడానికి కారణమైన వారిని కూడా 30 ఏండ్ల తర్వాత విడుదల చేసిన కోర్టు ఒక్క హత్య చేసినందుకు తన క్లయింటు జీవితాంతం జైలులోనే మగ్గాలనడం సరికాదని దోషి తరఫు లాయర్ చెప్పారు. ఇది సమానత్వపు హక్కును ఉల్లంఘించడమేనని లాయర్ ఆరోపించారు.
కాగా రాజీవ్ హత్య దోషులను విడుదల చేసినట్లే తనకూ స్వేచ్ఛ ప్రసాదించాలంటూ శ్రద్ధానంద్ పెట్టుకున్న పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. మైసూరు దివాన్ సర్ మిర్జా ఇస్మాయిల్ మనవరాలు షాకిరాకు, శ్రద్ధానంద్ ను వివాహం చేసుకుంది. 1986లో ఈ పెళ్లి జరిగింది. అయితే, అప్పటికే షాకిరాకు పెళ్లయింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి శ్రద్ధానంద్ ను పెళ్లి చేసుకుంది. షాకిరా పేరు మీద ఉన్న వందల కోట్ల ఆస్తులపై కన్నేసిన శ్రద్ధానంద్ 1991లో షాకిరాను హత్య చేశాడు. డ్రగ్స్ మత్తులో షాకిరాను సజీవంగా దహనం చేశాడు.
ఈ కేసులో 1994లో శ్రద్ధానంద్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత 2000 లో కోర్టు శ్రద్ధానంద్ కు ఉరి శిక్ష విధించింది. దీనిపై అప్పీల్ కు వెళ్లగా శ్రద్ధానంద్ కు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ 2008లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. జీవితాంతం జైలులోనే ఉండాలని, రెమిషన్, పెరోల్ లాంటి సదుపాయాలు ఏవీ కల్పించ వద్దని ఆదేశించింది. ఇది విన్న తర్వాత అనిపిస్తోంది గదూ… సామీ, అన్ని కేసుల్లోనూ తీర్పు ఒకేలా వుండదు అని.