‘మనం గాలి కోసం కిటికీ తెరుస్తాం. కానీ, గాలితో పాటు దుమ్ము కూడా లోపలికి వస్తుంది.’ అన్నది ‘అత్తారింటికి దారేది…’ సినిమాలోని డైలాగ్. అలాగే, వర్షాకాలం వస్తే వర్షాలు కురుస్తాయి, నీటికి లోటుండదు, అలాగే పంటలు పండుతాయి. కానీ, వీటితో పాటు దోమల విజృంభిస్తాయి. దోమకాటువల్ల మలేరియాలాంటి అనేక అనారోగ్యాలూ వ్యాప్తి చెందుతాయి. ఇవి చిన్నా, పెద్దా తేడా లేకండా అందరినీ బాధిస్తాయి, ఆందోళనకు గురిచేస్తాయి. అయితే, ఆడ ఎనాఫిలిస్ దోమల ద్వారా మలేరియా వ్యాపిస్తుందనే విషయం మనకు తెలిసిందే.
వర్షాకాలం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో మలేరియా పంజా విసురుతూంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది మలేరియా కారణంగా చనిపోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. అలాంటి మలేరియాను అరికట్టడంపై దృష్టిపెట్టిన యూకేలోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు ప్రత్యేకంగా జన్యుమార్పిడి దోమలను సృష్టించారు. ప్లాస్మోడియం పాల్సిఫారం అని పిలిచే సూక్ష్మజీవులు మలేరియా వ్యాధికి కారణం. ఈ సూక్ష్మజీవులు సోకినవారిని కుట్టిన దోమలు.. వేరే వ్యక్తిని కుట్టినప్పుడు వారి శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి. అసలు ఈ సూక్ష్మజీవులు వ్యాపించకుండా ఏం చేయాలన్న దానిపై ఇంపీరియల్ కాలేజీ లండన్ తోపాటు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కు చెందిన ‘ఇన్ స్టిట్యూట్ ఫర్ డిసీజ్ మోడలింగ్’ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. సాధారణ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేసి మలేరియా సూక్ష్మజీవులు వాటిలో వేగంగా పెరగకుండా చేయగలిగారు. ఈ వివరాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
మలేరియా సూక్ష్మజీవులు తొలుత దోమలోకి ప్రవేశించినప్పుడు వాటి పొట్టభాగంలో చేరి సంఖ్యను పెంచుకుంటాయి. తర్వాత వాటి నోటిలోకి చేరుతాయి. దోమలు మనల్ని కుట్టినప్పుడు తొండం వంటి నిర్మాణం ద్వారా మన శరీరంలో ప్రవేశిస్తాయి. తర్వాత రక్తంలో చేరి సంఖ్యను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుని వ్యాధిని కలుగజేస్తాయి. అయితే, శాస్త్రవేత్తలు దోమల్లో జన్యుమార్పిడి చేయడం ద్వారా వాటి కడుపులో ఈ మలేరియా సూక్ష్మజీవులు ఎదగడానికి ఎక్కువ సమయం పట్టేలా చేయగలిగారు. ఆ సూక్ష్మజీవులు దోమ నోటిలోకి చేరేనాటికి సదరు దోమ జీవితకాలం ముగిసిపోతుందని అంటున్నారు.
ఈ జన్యుమార్పిడి చేసిన దోమలను విడుదల చేస్తే అవి ఇతర దోమలతో సంకరం చెందడం ద్వారా తర్వాత పుట్టే దోమల్లోనూ మలేరియా సూక్ష్మజీవులను నిరోధించే శక్తి సమకూరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా మెల్లగా అన్ని దోమలు మారిపోయి మలేరియా వ్యాప్తి తగ్గిపోతుందని వివరిస్తున్నారు. మలేరియాను అరికట్టడంలో తమ ప్రయోగం శక్తిమంతమైన ఆయుధం అవుతుందని చెబుతున్నారు. డబ్ల్యూ.హెచ్.ఓ. గణాంకాల ప్రకారం ప్రపంచంలో సగం జనాభాకు మలేరియా సోకే ప్రమాదం పొంచి ఉంది. 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.10 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆరు లక్షల మందికిపైగా చనిపోయారు. మలేరియాపట్ల ఎప్పుడూ అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది.