రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఈరోజు పోలీసు అధికారులు, GHMC, HMWS&SB, TSSPDCL, Fire Services, Irrigation, Road Transport, R&B, Fire Services, Medical and Health department తదితర శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి (BGUS) ప్రతినిధులతో మాదాపూర్ లోని CCRT ఆడిటోరియంలో ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ గారు మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీన ప్రారంభమై, సెప్టెంబర్ 9 వరకూ కొనసాగే గణేష్ వేడుకలను నిర్విఘ్నంగా, ఘనంగా, గౌరవప్రదంగా జరుపుకోవాలన్నారు. భద్రతాపరంగా పోలీసులు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారన్నారు. గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో అందరు ఇన్స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ నిమజ్జనం మొదలుకొని అంతా ముందుగా ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆయన కోరారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని పౌరవిభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచించామన్నారు.
నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వినాయక నిమజ్జన విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, వలంటీర్లకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులపై నిఘా ఉంచామన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు (BGUS) ప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.
నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. విజిబుల్ పోలిసింగ్ తో పాటు సీసీటీవీలపై దృష్టి సారించాము. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా, భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు.
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. నిమజ్జనం సందర్భంగా GHMC అధికారులు ముందుగానే చెరువులు, బేబీ పండ్స్ లను సూచించాలన్నారు. వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, అవసరమున్న మేర క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుంతులుగా ఉన్నరోడ్లను పూడ్చేలా R&B అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు, విద్యుత్ లైట్లను, భారీ కేడ్లను నిర్మించాలని, మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలన్నారు. ప్రజలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్ పనులను చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., మేడ్చల్ మల్కాజ్ గిరి అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్, క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగేన్వర్, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ టి. శ్రీనివాస్ రావు, ఐపీఎస్., రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ, కూకట్ పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ మమత, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, డిటిసి ప్రవీణ్ రావు, ఎస్బీ ఏడీసీపీ రవి కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్, సీఎస్ డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, రాజేంద్రనగర్ హెల్త్ డిపార్ట్ మెంట్, DMHO డాక్టర్ సృజన, జీహెచ్ఎంసీ జోనల్ డీసీలు, మున్సిపల్ కమీషనర్లు, ఏసీపీలు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి వైస్ ప్రెసిడెంట్ కరోడిమల్ నర్సింగ్ పురి, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి వైస్ ప్రెసిడెంట్ ఎం. రామరాజు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి జనరల్ సెక్రెటరీ డాక్టర్ భగవంత్ రావు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సెక్రెటరీ రావినూతుల శశిధర్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఇన్స్పెక్టర్లు, జీహెచ్ఎంసీ, ఆర్అండ్ బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్ఎన్ డెపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.