Crime పార్టీ పదవుల విషయంలో తలెత్తిన వివాదం… ఓ యువ నాయకుడి హత్యకు దారి తీసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు గ్రామంలో చోటుచేసుకున్న ఓ హత్య కేసుకు సంబంధించి స్థానిక ప్రజలు చెబుతున్న దాని ప్రకారం.. గతంలో స్థానిక మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో తలెత్తిన వివాదమే.. ప్రస్తుత హత్యకు కారణమని భావిస్తున్నారు.
సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం మూలగుంటపాడు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పసుపులేటి రవితేజకు ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. రవితేజ, అతడి మిత్రుడు ఉమ ఇద్దరూ వేరువేరు ద్విచక్ర వాహనాలపై రాత్రి 8.30 గంటల సమయంలో కనుమళ్లకు వస్తున్నారు. ఈ సమయంలో వారి వెనుక నుంచి వచ్చిన లారీ అతడిని ఢీకొట్టింది. దాంతో రవితేజ రోడ్డు మీద పడిపోగా.… లారీ అతడిని తొక్కుకుంటూ వెళ్లిపోయింది. దీంతో రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి మిత్రుడు ఉమ లారీని వెంబడిస్తుండగా… అతడినీ లారీతో గుద్దించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా కొద్దిలో తప్పించుకున్నాడు.
రవితేజ మూలగుంటపాడులో ఉంటూ ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. సింగరాయకొండ మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో ఓ ఎంపీటీసీ సభ్యుడికి, రవితేజకు వివాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుత హత్యకు ఆ వివాదమే కారణం కావచ్చని భావిస్తున్నారు. రవితేజ హత్యతో అతని స్వగ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాంతో ఒంగోలు నుంచి అదనపు బలగాలను రప్పించి… గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.