Crime తన పుట్టినరోజు వేడుకలకు హాజరైన మామను బోల్తా కొట్టించి.. తన స్నేహితుల సాయంతో దాదాపు 11లక్షలు చోరీ చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఎల్బీనగర్ సీసీఎస్, మీర్పేట పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఆ వివరాలు..
ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ కథనం ప్రకారం… సైదాబాద్ సమీపంలోని కుర్మగూడలో నివసించే యాసర్ ఉలేమాన్(19) ఇటీవలే ఇంటర్ పాసయ్యాడు. జల్సాల కోసం అడ్డ దారులు తొక్కాడు. ఆగస్టు 31న అతని పుట్టినరోజు ఉండటంతో తల్లిదండ్రులు వేడుక నిర్వహించారు. మీర్పేట సమీపంలోని షరీఫ్నగర్లో నివసించే అతని మామ, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మామ ఇంట్లోని నగలూ, నగదు, విలువైన వాచీలపై ఎప్పటినుంచో యాసర్ కన్నుంది. ఇటీవల అతని పిన్ని సైతం విదేశాల నుంచి వచ్చి ఇదే వేడుకకు హాజరైంది. ఆమెకు చెందిన నగలూ, డాలర్లూ మామయ్య ఇంట్లోనే దాచిన సంగతి తెలుసు.
ఇదే అదనుగా ఆ ఇంట్లో చోరీకి తన స్నేహితుడు మహ్మద్ అయాజ్ఖాన్(19)ను పురమాయించాడు. అతను తన సహచరుడు హమ్దాన్ అశ్ఫాక్(19)తో కలిసి ఆ రాత్రి చోరీకి బయలుదేరారు. అశ్ఫాక్కు గతంలో చోరీ చేసిన అనుభవముంది. బురఖా ధరించి యువతిలా అయాజ్ఖాన్ వెంట ద్విచక్రవాహనంపై వెళ్లాడు. బురఖా తీసి జర్కిన్ వేసుకొని అశ్ఫాక్ ఇంట్లోకి వెళ్లగా.. అయాజ్ఖాన్ బయటే కాపలాగా ఉన్నాడు. యాసర్తో వీరిద్దరూ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ చోరీ పూర్తిచేశారు. 36తులాల బంగారం, రూ.10.5లక్షల విలువైన చేతి వాచీలు, రూ.32వేల విలువైన అమెరికా డాలర్లు, రూ.1లక్ష ఖరీదైన సోనీ డిజిటల్ కెమెరాను చోరీ చేసి పరారయ్యారు. పెద్దఎత్తున బంగారం దొరికినా చాలా తక్కువే దొరికిందనీ ఆ ఇద్దరూ యాసర్తో అబద్ధం చెప్పారు.
ముగ్గురినీ అరెస్టుచేసి అధికారులు రిమాండుకు తరలించారు. చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.