Special Article by SGV Srinivasa Rao
‘ఖనన్తు సప్తపాతాళం భ్రమాన్త్వాకాశమణ్డలే
ధావన్తు సకలాం పృథ్వీం నాదత్తముపతిష్ఠతే’
మానవుడు ఏడు పాతాళలోకాలు తవ్వితే తవ్వవచ్చు గాక. ఆకాశంలో తిరుగాడవచ్చుగాక. సమస్త భూమండలమంతా చుట్టి రావచ్చుగాక. అయినా సరే. ఎంతటి వీరుడికైనా ఆ దైవం ఇవ్వనిదే ఏదీ లభించదు. ఎంత ప్రయత్నించినా దైవం అనుకూలించనిది ఏదీ మన దరికి చేరదనేది సారాంశం. పురాణకాలం నాటి ప్రవచనమిది. సరే.. చాలాకాలం గడిచిపోయింది. పురాణాల కాలం నుంచి నవీన యుగానికి వచ్చాం. ఈ యుగంలో ప్రజలే ప్రభువులు. వాళ్లే దేవుళ్లు. పాలకుల తలరాతలు రాసేది వాళ్లే. వారి అనుకూలత లేకుండా ఎన్ని గారడీలు చేసినా.. ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజాస్వామ్యంలో అవన్నీ పనికిరావు.
మన దేశం చాలా విశాలమైంది. జనాభా కూడా చాలా ఎక్కువ. ఈ నేల మీద వేలవేల తీర్థాలున్నాయి. జనాల్లో సవాలక్ష పైత్యాలూ ఉన్నాయి. అదేంటో బ్రహ్మదేవుడు వాటన్నింటినీ కట్టగట్టి కలిపి నూరి కొందరి మెదట్లో పోసేస్తాడు. సదరు వ్యక్తిలో అవి చిత్రవిచిత్ర చిత్తభ్రమ కారకాలై వివిధ రూపాల్లో బయట పడుతుంటాయి. అలాంటి ఒక విచిత్ర భ్రమాన్విత ప్రక్రియే ‘కొత్త పలుకు’. ఆ పలుకుల నిండా అనేక భ్రమలు.. కలలు.. వికారాలు.. వెరసి పచ్చ పైత్యాలు. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టే రాతలు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ఒక రాజ్యాంగం అమల్లో ఉందని, ఎవరైనా ఆ చట్రంలో ఇమిడి పోవాల్సిందే తప్ప తామే సర్వం అనుకోడానికి వీల్లేదని పాపం ఆ రాతకృష్ణుడికి ఎప్పుడూ తోచదు. అంతేకాదు కేంద్రమైనా రాష్ట్రమైనా ఎంత పుడింగి పాలకుడైనా సదరు శాల్తీని అదుపుచేసే వ్యవస్థలున్నాయని కూడా ఆయనకు తట్టదు. ఏది అనుకుంటే అది చేసేయడానికి ఎవరినైనా తొక్కేయడానికి ఇది చైనా, రష్యా కాదని కూడా ఆలోచన రాదు. నిన్నగాక మొన్న అగ్నిపథ్ వ్యవహారం ఏమిటి? అంతకు ముందు వ్యవసాయ చట్టాల మాటేమిటి? అంతకన్నా ముందు పౌరసత్వ సవరణ చట్టానికి ఏ గతి పట్టింది? అనేది స్ఫురణకు రాదు. ఈశాన్య రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అక్రమంగా పడగొడితే కోర్టులు గడియారం ముల్లు వెనక్కితిప్పి పాత ముఖ్యమంత్రిని ప్రతిష్టించి కేంద్రం దవడ వాయగొట్టిన వైనమూ గుర్తుకురాదు. అవన్నీ చాలా సౌకర్యంగా మరిచిపోయి కేంద్రాన్ని ఎత్తుకునే పనిలో పడ్డాడు రాతకృష్ణ.
మోదీ ఇపుడాయనకు బాహుబలిలాగ కనిపిస్తున్నాడు. షాలో శకుని పాచికలు చూస్తున్నాడు. అందుకే తన తాజా ‘కొత్త పలుకు’ నిండా మోదీ-షాలను ఆకాశానికెత్తాడు. అక్కడికి ఈ దేశమేదో వాళ్ల అయ్య సొత్తైనట్టు వాళ్లకు కోపం వస్తే ఈ దేశంలో వేరెవరికీ బతకడమే సాధ్యం కాదన్నట్టు వాళ్లను ఎదిరించడమే తప్పన్నట్టు సూత్రీకరించాడు. కానీ తాటకను చంపడానికి రాముడు, బకాసురుడిని హతమార్చడానికి భీముడు పుట్టింది ఈ గడ్డ మీదేనని మరిచిపోయాడు. ఇదే నేల మీద ఉమ్మడి రాష్ట్రం ఉన్నపుడు ఎన్టీఆర్ను అక్రమంగా గద్దె దింపితే ఇందిర వంటి మొండి ఘటాన్నే మెడలు వంచి మళ్లీ ఎన్టీఆర్ను ప్రతిష్టించిన వైనం కూడా ఆయన విస్మరించారు.
‘కొత్త పలుకు’లో రాతకృష్ణుడి ప్రవచనాలు చూడండి.. మోదీ తో కేసీఆర్ అనవసరంగా వైరం పెట్టుకున్నాడు. కేసీఆర్పై మోదీ పగ పెంచుకున్నాడు. కేసీఆర్ సన్నిహితులపై ఈడీ దాడులు జరుగుతాయి. కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని మోదీ-షా ద్వయం నిర్ణయించుకున్నారు. ‘మీరు ఏ రకంగా కేసీఆర్కు సహకరించినా ఫలితం అనుభవించాల్సి ఉంటుంది’ అంటూ కేసీఆర్ సన్నిహితులకు వార్నింగులు వెళ్లాయి. త్వరలో కేసీఆర్ను అష్టదిగ్బంధనం చేయబోతున్నారు.. గమ్మత్తేమిటంటే.. నాకు వాళ్లు చెప్పారు, వీళ్లు చెప్పారు నాతో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే నేనే తుడిచి ఊరడించానని చెప్పుకున్న ఆర్కె… ఆ ముక్కలు ఎవరు చెప్పారో తన పత్రికలో రాసినట్టు చూడలేదు. ఎందుకు? కేసీఆర్కు వ్యతిరేకంగా చీమ చిటుక్కుమన్నా ఆ అంశాన్ని పతాక శీర్షికలో ప్రసవాలు చేసే ఆయన పత్రిక ఎందుకు ప్రచురించలేదో మనకు తెలియదు. ఇతర పత్రికల్లో కూడా అలాటి దాడులు జరిగినట్టుగానీ జరగబోతున్నట్టుగానీ చూడలేదు. ఇంతకీ ఇవి జరిగాయా? లేక బీజేపీకి ఇలా చేయవచ్చు అని ఈయన సిగ్నల్స్ ఇస్తున్నాడా? అది కాకపోతే కేసీఆర్తో సఖ్యంగా ఉంటే దాడులు జరుగుతాయ ని సదరు వర్గాలను బెదరగొడుతున్నాడా? కేసీఆర్ మీద దాడులు చేస్తే సానుభూతి వస్తుందంటూ సంకేతాలు ఎందుకిచ్చినట్టు? ఏమో తెలంగాణ ఇస్తామన్నపుడు హైదరాబాద్ను ఉమ్మడి చేయవచ్చు, యూటీ చేయవచ్చు అంటూ కథనాలు పరిచిన పత్రికలో రాతలను చూశాక సదరు రాతలను మనమెలాగైనా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది.
ఇంతటితో ఆగలేదు. మోదీతో వైరం వల్ల రాష్ట్రం నష్టపోతుందట! అబ్బో తెలంగాణ మీద ఎంత ప్రేమో? సరే అలాగే అనుకుందాం.. మరి రాష్ట్రం వచ్చిన కొత్తలో ప్రధానితో కేసీఆర్ మంచి సంబంధాలే నెరిపారు కదా? కేంద్రం నిర్ణయాలకు బేషరతుగానే మద్దతు కూడా పలికారు కదా? మిషన్ భగీరథకు మోదీని ఆహ్వానించి ఆయనతో ప్రారంభించారు కదా? మరి మోదీ అప్పుడేం ఉద్ధరించారు. ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారు? ఎన్నింటికి జాతీయహోదా ఇచ్చారు? ఎన్ని నిధులు వరద పారించారు? తాను స్వయంగా ప్రారంభించిన మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫారసు చేసినా పైసా ఇచ్చారా? బయ్యారం ఉక్కు ఇచ్చారా? రైల్వే కోచ్ ప్రాజెక్టు ఇచ్చారా? ఐటీఐఆర్ అనుమతించారా? అసలు ఒక్క సంతకంతో తెలంగాణకు రావలసిన హైకోర్టు ఇవ్వడానికి ఎంతకాలం తీసుకున్నారు? మరి మోదీతో కలిసి ఉండటం వల్ల ఒరిగిందేమిటి? ఇవాళ కొత్తగా జరిగే నష్టం ఏమిటి? నల్లరాయిని గొడ్డు రాసుకుంటే గొడ్డు వెంట్రుకలే రాల్తాయని.. మోదీ స్నేహం వల్ల దేశ రాజకీయాల్లో బాగుపడిన వారెవ్వరూ లేరు. దశాబ్దాల స్నేహంతో కొనసాగిన అకాలీదళ్ను.. శివసేనను చీల్చడానికి కూడా వెనుకంజ వేయని పార్టీ నుంచి, ప్రభు త్వం నుంచి ఏ ప్రాంతీయ పార్టీ ఆశించేది ఏముంటుంది?
తెలంగాణ తనంత తానుగా సాధించిన అభివృద్ధి, కట్టుకున్న ప్రాజెక్టులు, వేసుకున్న ప్రణాళికలు… దేశంలో అగ్రస్థానంలో నిలిపాయి తప్ప ఇందులో కేంద్రం సహకరించింది లేదు. దాని పాత్రా లేదు. హైదరాబాద్ నగరం తన చారిత్రక ప్రతిష్ఠ వల్ల కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు, కరెంటు, నీరు, ఇతర పౌర సౌకర్యాలు మెరుగుపడటం వల్ల పరిశ్రమలు వచ్చాయే కానీ మోదీ పైరవీల వల్ల ఒక్క పరిశ్రమ వచ్చిందీ లేదు, చచ్చిందీ లేదు. పైగా ఆల్రెడీ మంజూరై ఉన్న ఐటీఐఆర్ను గుజరాత్కు తరలించేసుకున్నారు. ఇవాళ కూడా తెలంగాణ అయినా, హైదరాబాద్ అయినా తన ప్రత్యేకతలు, కేసీఆర్ ప్రభుత్వ చొరవ కారణంగానే కొత్త పరిశ్రమలు రప్పించుకుంటున్నది తప్ప ఎవరో దయతలిస్తే ఎదగలేదు.
రాతకృష్ణుడి ప్రవచనం ప్రకారం ఇవాళ కేసీఆర్కు వ్యతిరేకంగా కేంద్రం చర్యలు తీసుకుంటే దేశంలో ఎవరూ నోరు మెదిపే పరిస్థితే లేదట! ఆయనతో చేయి కలిపేవాళ్లే కనబడడం లేదట. అసలు బీజేపీ తెలంగాణ మీద దృష్టి సారించడానికి కేసీఆర్ వైఖరే కారణమట. చెప్పేవాడు డాష్ డాష్ అయితే వినేవాడు తూచ్తూచ్ అని.. తెలంగాణలో ఒక వర్గం జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉండటమే తెలంగాణ ఆవిర్భావానికి ముందే బీజేపీని ఊరించిందని అందరికీ తెలుసు. అందుకే తెలంగాణ బిల్లుకు సమ్మతి తెలిపిందనీ దాని వెనుక ఆర్ఎస్ఎస్ మంత్రాంగం కూడా ఉందనీ అందరికీ తెలుసు.. ఒక్క రాధాకృష్ణుడికి తప్ప.మోదీని ఢీకొనగలిగిన నాయకుడే లేడని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. కానీ చరిత్ర చూస్తే తమిళనాడులో దశాబ్దాల కాలం నుంచి జాతీయపార్టీలు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా ఎన్నిసార్లు సర్కార్లను రద్దుచేసినా..విచారణల పేరిట వేధించినా అక్కడి ప్రాంతీయ పార్టీలు తట్టుకొని నిలబడ్డాయి తప్ప దాసోహమని మోకరిల్లలేదు. జాతీయ పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని టక్కుటమార విద్యలు ప్రదర్శించినా అక్కడ సూదిమొన మోపేంత జాగా కూడా సాధించలేదు. మోడీని ఢీకొట్టే నాయకుడే కనపడటం లేడన్న మాటా వట్టిదే. 1977లో ఇందిర దరిదాపుల్లో కనీసం 10,15వ స్థానంలో నిలవగలిగిన నాయకుడు నాటి జాతీయ రాజకీయాల్లో లేడు. అయినా కలెగూరగంప లాంటి జనతా పార్టీ విజృంభించి కాంగ్రెస్ను చిత్తుగా ఓడించింది. స్వయంగా ఇందిరను అనామకుడైన రాజ్నారాయణ్ భారీ మెజారిటీతో ఓడించాడు. ఇందిర కుమారుడు సంజయ్ సహా ఆమె మంత్రివర్గంలో పలువురు చిత్తుగా ఓడిపోయారు. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఢీ అంటే ఢీ అనే గొప్ప నాయకుడెవరూ లేరే? ఆ మాటకొస్తే ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదే? మరి జనతాపార్టీ ఎలా విజయం సాధించింది? ఎన్నికల రాజకీయాల్లో నాయకుడి నాయకత్వమే కాదు. పాలన కూడా ముఖ్యాంశమే. ఇవాళ మోదీ పాలన మీద ఎవరు సంతృప్తిగా ఉన్నారు? ఏ వర్గం ఆనందంగా ఉంది. రైతులా? కార్మికులా? ఉద్యోగులా? విద్యావంతులా? వ్యాపారులా? యువకులా? మహిళలా? పారిశ్రామికవేత్తలా? చివరికి కేంద్ర ప్రభుత్వ అడ్వర్టయిజ్మెంట్ బడ్జెట్ భారీగా తగ్గించి, న్యూస్ ప్రింట్ మీదా సుంకం విధించినా కేంద్రంపై రాధాకృష్ణ సంతృప్తిగా ఉన్నాడా? ఎవరు ఆనందంగా ఉన్నారని పొలోమంటూ లగెత్తుకొచ్చి మోదీ కి ఓట్లు వేస్తారు?
ఉప ఎన్నికల్లో ఫలితాలు వేరు. సాధారణ ఎన్నికల పరిస్థితి వేరు. ఉప ఎన్నికల్లో అభ్యర్థి స్థానిక రాజకీయాలు, సెంటిమెంట్లు పనికివస్తాయి. కానీ సాధారణ ఎన్నికలో పరిస్థితి భిన్నంగా ఉం టుంది. ఐదేండ్లలో ఏం చేశారు? అనేది ప్రధాన అంశంగా మారుతుంది. ఇవాళ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ముందున్న సాధారణ ఎన్నికల్లో గెలుస్తుందనేది అపరిపక్వ వాదన.
ఇవాళ దేశంలో జరుగుతున్నదేమిటి? దేశం ఎటుపోతున్నది? మోదీ-షా చివరికి దేశాన్ని ఏం చేస్తారు? అనే ప్రశ్నలు బుద్ధిజీవుల్లో తలెత్తుతున్నాయి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అమ్మేయడం.. దేశ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం.. న్యాయవ్యవస్థ మీద దుష్ప్రచారాలు చేయడం.. ప్రభుత్వ వ్యవస్థలను ప్రతిపక్షాల నోళ్లు నొక్కడానికి వినియోగిం చడం.. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది.
వ్యాపారుల కోసం.. వ్యాపారులు నడిపే వ్యాపారుల రాజ్యం నడుస్తున్నది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఎగుమతులు అడుగంటుతున్నాయి. వ్యవసాయాన్ని ప్రభుత్వమే పీక నులిమే కార్యక్రమం చేపట్టింది. పారిశ్రామికరంగం అతలాకుతలమవుతున్నది. ధరలు అదుపు తప్పాయి. విదేశాంగ విధానం విఫల మంత్రాంగమైపోయింది. దేశం చుట్టూ ఉన్న ఏ ఒక్క దేశంతో సఖ్యత లేదు. చైనా మన భూభాగంలో గ్రామాలకు గ్రామాలే కడుతుందన్న వార్తలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను అడ్డదారిలో కూల్చేయడం కేంద్రం ప్రభుత్వ పెద్దల విధానంగా మారింది. ప్రభుత్వ వ్యవస్థలను అడ్డగోలుగా వినియోగిస్తున్నారు. మేధావులు ఒక్కొక్కరుగా ప్రభుత్వం నుంచి నిష్క్రమిస్తున్నారు.
దేశం దేశభక్తి గురించి మాట్లాడే పార్టీ పాలనలో దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం ప్రజలు జీర్ణించుకుంటున్నారా? దేశం గురించి మాట్లాడే పార్టీ పాలనలో.. సైన్యం వాడే రఫేల్ విమానాల కొనుగోలులో కుంభకోణం వంటి ఆరోపణలుండటం దేనికి సంకేతం! దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోగా ఇద్దరు వ్యాపారులు మాత్రం ప్రపంచ ఆర్థిక దిగ్గజాలుగా ఎదగడం, బ్యాంకులను లూటీ చేసిన వారు విదేశాల్లో హాయిగా తిరగడాన్ని ప్రజలు ఏ రకంగా తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలో ఇవన్నీ ఓట్ల రూపం తీసుకోవా?
పాపం రాధాకృష్ణకు చంద్రబాబు తప్ప మరెవరినీ హీరోలుగా ఊహించుకోలేని సమస్యేదో ఉంది. ఆయనొక్కడే హీరో మిగిలిన వాళ్లంతా జీరోలే అనే భావన ఏదో బలపడిపోయింది.
తెలంగాణ వచ్చిన కొత్తలో.. ‘చంద్రబాబు చూడండి ఢిల్లీలో తన పలుకుబడి కారణంగా రాష్ట్రానికి అది సాధించాడు, ఇది సాధించాడు’ అంటూ అప్పట్లో ‘కొత్త పలుకు’లో చెక్కభజన చేశాడు. కేసీఆర్కు ఢిల్లీలో పలుకుబడి లేక వెనుకబడి పోతున్నాడని కూడా సంబురపడేవాడు. కాలం చిత్రమైంది. కొద్ది రోజుల్లోనే పరిస్థితి తిరగబడింది. మోదీ కొలువులో బాబు కన్నా కేసీఆర్ పలుకుబడి బాగా పెరిగింది. విమానాశ్రయాల్లో గంటల తరబడి నిలబడి చర్చలు చేసేంత స్థాయికి కేసీఆర్ పెరిగారు. దాంతో ఢిల్లీ పలుకుబడి వాదన మాయమైంది. పాలన, అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రణాళికలు, సంక్షేమం.. ఇలా ఏ రంగంలో చూసినా అందనంత ఎత్తుకు కేసీఆర్ ఎదిగారు.
తెలంగాణను ఒక స్థాయికి తెచ్చిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టిసారించారు. ఈ దేశంలో పుట్టిన ఎవరికైనా దేశం బాగుండాలని బాగుపడాలని కోరుకునే హక్కున్నది, ఉంటుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజల్లోంచి వచ్చి వారి కష్టాలను ఇబ్బందులను చూసి, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడిపే ప్రణాళికలు అమలుచేసిన అనుభవం ఆయనను దేశ సమస్యల మీద దృష్టిసారించేలా చేశాయి. నీటికోసం గోస పడ్డ ప్రాంతం నుంచి వచ్చిన నేతగా ఆ నీటి విలువ తెలిసినవాడిగా ఆ నీటికి ప్రాంతాల జాతకాలను మార్చే శక్తి ఉం దని స్వయంగా చూసిన నేతగా దేశంలోని వేల వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలు కావడం మీద ఆవేదన పడ్డారు. దేశాన్నంతా విద్యుత్మయం చేయగలిగిన సామర్థ్యం ఉండీ దాన్ని వినియోగించుకోలేని అసమర్థత మీద ఆగ్రహం చెందారు. ఎందరో మహా నాయకులు దూరదృష్టితో ఆలోచించి రూపొందించిన వ్యవస్థలను కండ్లముందు కుళ్లబొడుస్తుంటే ఎదురు తిరిగారు.
రాష్ట్రాల హక్కులన్నీ హరించి వాటిని భిక్షమెత్తే స్థాయికి దిగజార్చడం మీద పోరాటం ప్రకటించారు. మనిషి మీద మనిషిని ఉసిగొల్పి ఓట్లు రాల్చుకొనే రాజకీయాల మీద యుద్ధం ప్రకటించారు. కోట్లాది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఒకరిద్దరు వ్యాపారుల బొక్కసాలు నింపే సేల్స్మేన్లుగా మారటం మీద, వారికోసం దేశ సంపదను తొక్కిపెట్టి విదేశాల నుంచి బొగ్గు నిల్వలను అధిక రేట్లు చెల్లించి తీసుకోవాల్సిన విధానం మీద సమరం చేశారు. రాతకృష్ణుడికి ఇది అస్సలు మింగుడు పడటం లేదు. చక్రం తిప్పే కాపీరైట్ బాబుకు మాత్రమే ఉండాలన్నది ఈయన ఆలోచన. మరొకరు అందునా కేసీఆర్ ఆ వైపునకు వెళ్లడం జీర్ణం కావడం లేదు. మహా మహా నాయకులే మౌనవ్రతం పాటిస్తున్న తరుణంలో కేసీఆర్ మోదీని కడిగిపారేయడం..
అది దేశ రాజకీయాల్లో సంచలనం కావడం నచ్చడం లేదు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై బుద్ధిజీవుల్లో చర్చ జరుగుతున్నది. జాతీయ మీడియాలో చర్చ నడుస్తున్నది. ఇవాళ జాతీయ మీడియాలో మోదీతో తలపడే దమ్మున్న నేతగా కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణలో ఒక సక్సెస్ఫుల్ మోడల్ అమలుచేసిన సీఎంగా దేశ ప్రజలు ఆయనను చూస్తున్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు, ప్రాజెక్టుల మీద జాతీయ మీడియా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. భారీ ప్రాజెక్టులను మూడేండ్లలో పూర్తిచేయడం, ఇంటింటికీ మంచినీరు అందించడం, 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేవి ఉత్తరాది ప్రజలకు అద్భుతాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఇవాళ జాతీయస్థాయిలో ఒక ఆసక్తికర అంశంగా మారింది. సహజంగానే ఇది కొంతమందికి రుచించదు.
రాతకృష్ణుడైనా మరొకరైనా గుర్తుంచుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. మోదీ, షాలు జీవితకాలపు పదవుల్లో లేరు. తిరిగి ఎన్నికలు జరగడానికి రెండేండ్ల వ్యవధి కూడా లేదు. సర్కారు సంప్రదాయాల్లో చివరి ఆరు నెలలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. అంటే మిగిలింది ఏడాదికి అటూ ఇటూ అంతే. కేంద్ర రాజకీయాల్లో ఎన్నికల ఏడాదిలో అధికారులెవరూ ప్రభుత్వం ఆదేశాలను శిరసావహించరు. అందునా రాజకీయ కక్షలకు దారితీసే అంశాలపై వేగంగా స్పందించరు. ఎన్నికల తర్వాత ఎవరు ఎటో తెలియదు కాబట్టి అనవసరంగా రాజకీయాల్లో తలదూర్చరు. పైగా దేశంలో ఇప్పుడు మోదీ హవా ఏం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఢంకా బజాయించి గెలుస్తుందనే ధీమా కూడా లేదు. అదీపోతే రెండోసారి అధికారం చేపట్టాక మోదీ సర్కారు అనేక విమర్శలు ఎదుర్కొంటున్నది. అనేక వివాదాల్లో ఇరుక్కున్నది. ఉత్తరాదిని తీవ్రంగా ప్రభావితం చేసే సైన్యం కొలువుల విషయంలో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్దగా చదువుకోనివారంతా సైన్యంలో చేరడం ఆనవాయితీగా ఉన్నది. అది ప్రభుత్వ ఉద్యోగమని దానికి జీవితకాలపు భద్రత పింఛన్ ఉంటాయని దానిమీద వ్యామోహం. సైన్యం ఉద్యోగం తెచ్చుకున్నాకే పెళ్లి అనే సంప్రదాయం ఉంది. అలాంటి సైన్యం కొలువును మోదీ సర్కారు నాలుగేండ్ల నాటకంగా మార్చేసింది. జీవితకాలపు భద్రత అనే కల కండ్లముందు భగ్నమైంది. ఇది అక్కడి గ్రామీణ యువత మీద తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు ఎల్ఐసీ ప్రైవేటీకరణ మధ్య తరగతి ప్రజలు మోదీ మీద పెట్టుకున్న ఆశలను భగ్నం చేసింది. దేశంలో గ్రామాలు పట్టణాలతో సంబంధం లేకుండా ఎల్ఐసీని గాఢంగా విశ్వసిస్తారు. దాన్ని ప్రైవేటీకరణ చేయటమనేది జీర్ణించుకోలేని అంశం.
ఇక ఇల్లు నడిపే మహిళల మీద ధరల పిడుగు వ్యతిరేకతను పెంచేదే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మిగిలిన సమయమెంత? పైగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అలాంటి చర్యల వల్ల మూట కట్టుకునేదెంత? అనేది ఇక్కడ ప్రధానాంశం. నిన్న మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టగలిగాడు బీజేపీ కనుసన్నల్లో ఏక్నాథ్శిండే. కానీ ఆయన రేపు ఎన్నికల్లో గెలిపించగలడా? మరాఠావాదానికి ప్రతిరూపమైన ఠాక్రే స్థానంలో ఏక్నాథ్లను తోక్నాథ్లను ప్రజలు ఆదరిస్తారా? ఓట్లేస్తారా? అదే ప్రయోగం ఏ రాష్ట్రంలో జరిగినా ఏం జరుగుతుంది? ప్రజలు కండ్లు మూసుకొని నిద్ర పోతారనుకుంటున్నారా?
ఇందిర హత్యానంతరం దేశమంతా వ్యాపించిన ఆ సానుభూతి ప్రభంజనంలో పెద్దపెద్ద పార్టీలు, మహామహా నాయకులే కొట్టుకుపోయినా.. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ను అక్రమంగా గద్దె దించిన అకృత్యం కారణంగా కాంగ్రెస్ను ప్రజలు చిత్తుగా ఓడించారు. దశాబ్దాలపాటు అమ్మ అని ప్రజలతో పిలిపించుకున్న ఇందిర హత్యకు గురైనా ప్రజలు కరుణ చూపలేదు. నాటి వెన్నుపోటు దారులకు కత్తులను అందించిన పాపానికి కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఇపుడు బీజేపీ అదే దారిలో పయనిస్తున్నది. మరి అదే రాష్ట్రంలో ఫలితం ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఆ విషయం బీజేపీ భజనపరులు, జోకుడుగాళ్లు గుర్తు పెట్టుకోవాలి. కర్కటిగర్భం అని సంస్కృత నానుడి ఒకటున్నది. కర్కటి అంటే ఎండ్రకాయ. అది గర్భందాల్చడం దాని ఆత్మ వినాశనానికే. గర్భంలో పెరిగిన శిశువు చివరికి దాన్ని శరీరాన్ని చీల్చుకొని బయటకు వస్తుంది. దానితోఅది మరణిస్తుంది. బీజేపీ వాపూ కర్కటి గర్భంలాంటిదే. ప్రభుత్వాలను పడగొట్టిన పాపం దాని గర్భాన్ని చీల్చి బయటకు రాక తప్పదు. ఎన్ని ప్రభుత్వాలు పడగొడితే అన్ని రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పోయినట్టే లెక్క. మరోవైపు ఠాక్రేలు, స్టాలిన్లు, కేసీఆర్లు పునాదిలేని నాయకులు కారు. పులి ఎంత దెబ్బతింటే దాని పంజావేగం అంత వాడిగా ఉంటుంది. అది గుర్తు పెట్టుకోవాలి.
బుద్ధిమంతుడని సద్ది కడితే… ‘బుద్ధిమంతుడని సద్దికడితె బొడ్రాయి దగ్గరే భోంచేసి పన్నాడని’.. 2014లో మోదీని గెలిపించిన నాడు ప్రజల్లో ఎన్నెన్నో ఆశలున్నాయి. వాజపేయి తరహా హుందాతనం, గాంభీర్యం; గుజరాత్ తరహా అభివృద్ధి, నల్లధనానికి కళ్లెం, అవినీతిరహిత పాలన, గుండాయిజం నిర్మూలన.. ఇలా అనేక ఆశలుండేవి. అందులో ఏ ఒక్కటైనా ఇవాళ నెరవేరిందా? ప్రజలు అలా భావిస్తున్నారా?
ప్రత్యేక కధనం by ఎస్జీవీ శ్రీనివాస రావు