హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫిక్షనల్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నిజాయితీకి మారుపేరు’ అనేది ఉపశీర్షిక. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ’అల్లూరి’ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
”ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్.. పోలీస్ బయల్దేరాడు రా” అనే డైలాగ్ తో టీజర్ లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు శ్రీవిష్ణు. నేరస్తులని వెంటాడటం, వారికి పోలీస్ పవర్ చూపించడం, నక్సల్ స్థావరానికి వెళ్లి ” ఎస్ఐ అల్లూరి సీతారామరాజు” అని తనని తాను పరిచయం చేసుకొని తెగువ చూపడం ఆసక్తికరంగా వుంది.
శ్రీవిష్ణు, అల్లూరి పాత్రలో డైనమిక్ & పవర్ ఫుల్ గాకనిపించారు. ఈ పాత్ర కోసం శ్రీవిష్ణు పూర్తి ట్రాన్సఫర్మేషన్ కావడం టీజర్లో విశేషంగా కనిపిస్తుంది. దర్శకుడు ప్రదీప్ వర్మ అల్లూరి పాత్రకు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ మూడ్ సెట్ చేసింది. టీజర్ ని చూస్తే అల్లూరి గ్రిప్పింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్గా ఉండనుందని అర్ధమౌతుంది.
కథానాయికగా నటించిన కయదు లోహర్, కీలక పాత్రలో నటిస్తున్న సుమన్ లను టీజర్ లో రివీల్ చేయలేదు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
టీజర్ రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు మాట్లాడుతూ… అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా వుంది. దర్శకుడు ప్రదీప్ తో నాలుగేళ్ళుగా ప్రయాణిస్తున్నా. అల్లూరి సీతారామరాజులో వుండే ఆవేశం దర్శకుడు ప్రదీప్ లో చూశాను. సైనికులు, పోలీసులు, వైద్యులు.. ఈ ముగ్గురిని రియల్ హీరోస్ గా చూస్తా. ఇలాంటి పాత్రలు వచ్చినపుడు చాలా నిజాయితీ వుండి నచ్చితేనే చేయాలనీ అనుకునేవాడిని. సరిగ్గా ఇదే సమయంలో నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ పాత్ర దొరికింది. ఈ పాత్ర చేసిన తర్వాత నేను ఎందుకు పోలీసు అవ్వలేదని అనుకున్నాను. నా కెరీర్ బెక్కెం వేణుగోపాల్ గారితోనే మొదలైయింది. ఆయనతోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నా. ఇది ఫిక్షనల్ బయోపిక్. రియల్ గా జరిగిన సంఘటనని తీసుకొని ఒక కథగా చేశాం. టీం అంతా అద్భుతంగా పని చేసింది. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. నేటి సమాజానికి కావాల్సిన సినిమా ఇది” అన్నారు.శివాజీ మాట్లాడుతూ… నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు నాకు మంచి మిత్రులు. మేము ఎప్పటి నుండో ప్రయాణం చేస్తున్నాం. ఆయన ప్రతి కథ నాకు చెప్తారు. అల్లూరి కథ కూడా చెప్పారు. నిర్మాత, డిస్ట్రిబ్యుటర్ ప్రశాంతంగా బతకాల్సిన సినిమా ఇది. దర్శకుడు అద్భుతమైన కథని తయారు చేసుకున్నారు. పోలీసు కథలకు ఎప్పుడూ పవర్ వుంటుంది. అల్లూరిలో కథలో కూడా సూపర్ పవర్ వుంది. శ్రీవిష్ణు ఎప్పుడూ కొత్తకథలుచేయడానికి ఇష్టపడతాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా ఖచ్చితంగా కొత్తదనం ఫీలౌతారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.