త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
సోమవారం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. వజ్రోత్సవాల వేళ జరుపుకుంటున్న సంబరాలు కావడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, అదనపు కలెక్టర్ తిరుపతి రావు, అధికార అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులు వెలమ రాంరెడ్డి గారిని మంత్రి సన్మానిచ్చారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా కొనసాగిన శకటాల ప్రదర్శనను తిలకించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. శకటాల ప్రదర్శనలో ప్రధమ బహుమతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ద్వితీయ బహుమతి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ,తృతీయ బహుమతి ఎస్.సి.కార్పొరేషన్ శాఖలకు వచ్చినవి. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 5,729 మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 2 వందల 58 కోట్ల 38 లక్షల చెక్కును మంత్రి అందజేసారు.
గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు, వృద్ధ సంక్షేమ, ఎస్. సి. కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల శాఖ, వ్యవసాయ, ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ, అటవీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖలకు చెందిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు.
పంద్రాగస్టు వేడుక సందర్భంగా శంకర్ పల్లి ప్రభుత్వ మోడల్ హై స్కూల్, నందిగామ నాక్టో హై స్కూల్, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్, హైదర్ షా ఎస్.ఎల్.పి మోడల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఒయాసిస్ స్కూల్ వెయ్యి మంది విద్యార్థులచే గాంధీ వేషధారణ, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి.
ఈ వేడుకల్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫేన్ రవీంద్ర, అదనపు కలెక్టర్ తిరుపతి రావు, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, అన్ని శాఖలకు చెందిన అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.