‘తాటిచెట్టు ఎందుకెక్కావురా?’ అంటే ‘దూడ గడ్డి కోసం’ అన్నాట్ట వెనకటికి ఒకడు. ఇప్పుడు మనం మాట్టాడుకోబోయే విషయం కూడా అట్టాగే వుంటుంది. విషయమేంటంటే, అనగనగా అతడో పూజారి. మన దగ్గర కాదులెండి, కేరళలో. బురఖా వేసుకుని వయ్యారంగా రోడ్లమీద తిరుగుతుంటే చూసిన ఆటో డ్రైవర్లు ఈ యవ్వారమేదో విచిత్రంగా వుందనిపించి అతగాడిని పట్టుకెళ్లి పోలీసులకు అప్పగించారు.
కేరళలోని మెయ్యాపూర్ ప్రాంతంలోని ఓ ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు జిష్ణు నంబూద్రి. అక్టోబర్ 7వ తేదీన కోయిలాండీ జంక్షన్ లో బురఖా ధరించి ప్రత్యక్ష్యమయ్యాడుట…! ఇది చూసి నిలదీసిన ఆటోడ్రైవర్లకు చికెన్ పాక్స్ సమాధానం వచ్చింది. కేసు పోలీసుల దాకా చేరింది. ‘బురఖా వేసుకోవడమేంది సామీ?’ అని పోలీసులు కొశ్చన్ మార్కు ప్రశ్న వేసేటప్పటికి నంబూద్రి దూడ గడ్డిలాంటి సమాధానమే చెప్పాట్ట.
‘మరే… మరే… నాకు చికెన్ పాక్స్ సోకింది. అందుకే, బురఖా వేసుకుని తిరుగుతున్నానూ’ అన్నాట్ట. ప్రాథమిక పరీక్షల అనంతరం పోలీసులు అవాక్కయ్యారుట. ఎందుకంటే, అతడి శరీరంపై చికెన్ పాక్స్ వ్యాధి లక్షణాలు కించిత్ కూడా కనబడలేదుట. నంబూద్రి బంధువులు వచ్చి తమవాడేనని చెప్పడంతో అతడి వివరాలన్నీ తీసుకుని పోలీసులు విడిచిపెట్టారుట. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే అతడిమీద ఎలాంటి నేరారోపణలూ లేవుట. మరి, బురఖా ఎందుకు వేసుకు తిరిగినట్టు?! ఏమో… ఆ దేవుడికే తెలియాలి.