ప్రేమించుకుందాం రా , సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఆర్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీజ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సామ్ జి, వంశీ కృష్ణ వర్మ ఓ యూనిక్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని లాక్ చేసిన మేకర్స్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేశారు.
మోషన్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సముద్రతీరంలో హీరో మంచంపై నిద్రపొతుండగా.. ”చాలా ప్రశాంతంగా వున్న ఇతని జీవితంలోకి ఒక రోజు నిద్రముంచుకొచ్చింది నాయిన” అనే వాయిస్ వినిపిస్తూ..వచ్చింది నిదరే అయినా అది ప్రమాదకరం అనే అర్ధం వచ్చేట్లు డేంజర్ బోర్డ్ చూపించడం.. తర్వాత బుర్రకథ స్టైల్ లో వినిపించిన కొన్ని లైన్స్ చాలా క్యూరియాసిటీని పెంచాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే.. చిత్రాలు చేశాను. ఇప్పుడు కథానాయకుడిగా ”నిదురించు జహాపన’ చేస్తున్నాను. మోషన్ పోస్టర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇది గ్రేట్ జర్నీ. అనూప్ రూబెన్స్ గారు వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రసన్న గారు చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. మీ అందరినీ తప్పకుండా అలరిస్తుంది. జీవితాంతం సినిమాల్లోనే వుంటాను. సినిమా నా ప్రాణం. మీ అందరినీ అలరించడానికి నా శక్తిమేర ప్రయత్నిస్తాను”అన్నారు.