Crime ప్రజల నుంచి మద్ధతు లేకపోయినా, అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా… అధికారం కోసం ఎన్నో కుట్రలు చేస్తున్న మయన్మార్ సైన్యం… తాజాగా ఓ దుర్ఛర్యకు పాల్పడింది. తన పాలనకు ఎదురు తిరుగుతున్న వారిని మట్టుబెట్టేందుకు అంటూ… ఏకంగా ఓ పాఠశాలపైనే హెలీకాప్టర్తో కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో అభం శుభం తెలియని ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడగా… వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కి కర్కషంగా దేశాన్ని ఏలుతున్న సైనిక జుంటా… తాజాగా సాగింగ్ ప్రాంతం లెట్యట్కోనేయ గ్రామంలోని ఓ పాఠశాలపై సైనిక హెలీకాప్టర్తో కాల్పులకు తెగబడింది.
ఇంత చేసి ఆరుగురు చిన్నారుల ప్రాణాలు బలిగొన్న మయన్మార్ సైన్యం… తమ పనిని సమర్ధించుకుంది. తిరుగుబాటుదారులు ఆ స్కూల్లో దాక్కున్నారని, తనిఖీల కోసం వచ్చిన సైనిక హెలీకాప్టర్ పై దాడికి తెగబడ్డారంటూ ఆరోపణలు చేస్తుంది. వారిని అంతమొందించేందుకే… తాము ఎదురుదాడికి దిగామని వివరణ ఇచ్చింది. తిరుగుబాటుదారులు ప్రజలను కవచాలుగా వాడుకొని దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.
కాగా… మయన్మార్ సైన్యం దాడుల్లో చనిపోయిన చిన్నారులను మృతదేహాల్ని ఘటనా స్థలం నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని ఓ పట్టణానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసిందని స్థానికులు చెబుతున్నారు. మయన్మార్ సైన్యం ఉద్దేశ పూర్వకంగానే పాఠశాలలను లక్ష్యంగా చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఎంతో హేమైనా పని అని.. అభం శుభం తెలియని చిన్న పిల్లల్ని తమ రాజకీయ అవసరాల కోసం బలి తీసుకోవడం ఎంతవరకు సరైన పని అని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.