Ntr : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్… ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. వారితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను వారు స్మరించుకోనున్నారు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ కూడా సమాధి వద్దకి చేరుకొని తండ్రి ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించాడు.
ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగంలో నందమూరి తారక్ రామారావు గారు తిరుగులేని శక్తిగా రాణించారు. రాజకీయ నేతగా ఆయన అందించిన సేవలు, పాలనా సంస్కరణలు మైలు రాయిగా నిలిచాయి. తెలుగు వారి గుండెల్లో ఆయనకి ప్రత్యేక స్థానం ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే జాతీయ పార్టీలను ఒక ధాటి పైకి తీసుకు వచ్చి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలిచారు అంటూ గుర్తు చేశారు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులూ కూడా ఎన్టీఆర్ కి నివాళులు అర్పించారు. కాగా ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతి కావడంతో సంవత్సరం క్రిందటి నుంచి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమెరికా న్యూజెర్సీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించనున్నట్టు ప్రకటించారు. ఒక తెలుగు వాడి విగ్రహం విదేశాల్లో స్థాపించడం ఇదే మొదటిసారి. ఎన్టీఆర్ వర్దంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.