Bhakthi తాజ్మహల్ కన్నా పెద్దది.. వాటికన్ సిటీలోని కేథడ్రల్ చర్చి కన్నా పొడవైనది.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. బంగాల్లోని మాయాపుర్లో ఇస్కాన్ సంస్థ వేదిక్ ప్లానెటేరియం దీన్ని నిర్మిస్తోంది. 2024 నాటికి ఇది పూర్తికానుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఇది పూర్తయితే వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా నిలవనుంది.
ఈ వేదిక్ ప్లానెటేరియం నిర్మాణానికి 1976లోనే అడుగులు పడ్డాయి. ఇస్కాన్ సంస్థ వ్యవస్థాపకులు ప్రభుపాద ఈ మేరకు ప్రయత్నాలు చేశారు. మాయాపుర్లో ఉన్న ఇస్కాన్ మందిరానికి అనుబంధంగా వైదిక జ్ఞాన, విజ్ఞాన కేంద్రం ఉండాలని ఆయన భావించారు. వేదాల జ్ఞానాన్ని ప్రజలకు పంచడం సహా ప్రపంచం ఎలా ఏర్పడిందనే విషయాలను ఈ ప్లానెటేరియం ద్వారా తెలియజేయాలని అనుకున్నారు. అయితే, దశాబ్దాలు గడిచిన తర్వాతే ఈ నిర్మాణ పనులకు మోక్షం లభించింది.
అమెరికా క్యాపిటల్ భవనాన్ని తలపించే ఈ నిర్మాణం 2010 ఫిబ్రవరి 14న ప్రారంభమైంది. ప్రతిష్టాత్మకంగా సాగుతున్న నిర్మాణ పనులు పలు కారణాల వల్ల 2016లో నిలిచిపోయాయి. అనంతరం, కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. ఫలితంగా మందిర నిర్మాణం మరింత ఆలస్యమైంది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2024 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అల్ఫ్రెడ్ ఫోర్డ్.. అంబరీశ్ దాస్గా మారి: ఫోర్డ్ కంపెనీ వ్యవస్థాపకుడైన హెన్రీ ఫోర్డ్ ముని మనవడు అల్ఫ్రెడ్ ఫోర్డ్.. ఈ మందిర నిర్మాణం వెనక కీలకంగా వ్యవహరించారు. 1975లో ఇస్కాన్లో చేరిన అల్ఫ్రెడ్ ఫోర్డ్.. తన పేరును అంబరీశ్ దాస్గా మార్చుకున్నారు. ఈ మందిర నిర్మాణం కోసం ఆయన 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ.240 కోట్లు) విరాళంగా ఇచ్చారు.