Accident : దైవ దర్శనానికి వెళ్తూ భక్తులు అనుకోని రీతిలో ప్రమాదానికి గురయ్యారు . ఈ వార్తతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. శబరిమలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు పతనంథిట్ట సమీపంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్ర గాయాలవ్వగా… వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతుంది. బాధితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బస్సు కొండ ఎక్కుతుండగా అదుపు తప్పి కింద పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా శబరిమలలో మణికంఠుడి దర్శనాలు ఈ బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. మేల్శాంతి పరమేశ్వరన్ నంపూతిరి మండల పూజ చేసి గర్భగుడిని ప్రారంభించారు. డిసెంబర్ 27 వరకు మండల పూజ కొనసాగనుంది.
కాగా కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరిమిత సంఖ్యలో శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భక్తులను అనుమతించింది. ఈ ఏడాది కొవిడ్ ఆంక్షలను తొలగించి దర్శనానికి అనుమతించారు. అయితే భారీ వర్షాలు కురుస్తున్నందున భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పంబా నది భారీగా ప్రవహిస్తుండటంతో ఈ ప్రాంతంలో ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఏటా లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. శబరిమల పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగే అవకాశం ఉంది. దర్శనాలు ప్రారంభం అయ్యి వారం రోజులు కూడా కాక ముందే ఈ ఘటన జరగడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు.