Central Governament : కేంద్ర ప్రభుత్వం రైతులకు ఓ శుభవార్త ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ ఆ భారాన్ని రైతులపై పడనీయబోమని కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఈ మేరకు 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు రబీ సీజన్ లో వాడే ఎరువుల పై రాయితీ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ కాలానికి గానూ మొత్తం రూ.51,875 కోట్ల రూపాయల రాయితీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రమంత్రి మండలి తాజా నిర్ణయంతో రైతులకు నోటిఫై చేసిన ఫాస్పటిక్, పొటాసిక్ ఎరువులు అందుబాటు ధరల్లో లభించనున్నాయి.
ఈ మేరకు నేడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నత్రజని (ఎన్), భాస్వరం (పి), పొటాష్ (కె), సల్ఫర్ (ఎస్) వంటి ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ (ఎన్ బిఎస్) కోసం కేంద్ర ఎరువుల శాఖ ప్రతిపాదనకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రైతులకు రూ.51,875 కోట్ల ప్రయోజనం చేకూరనుంది.
దీనిలో భాగంగానే ఈ ఏడాది రబీ సీజన్లో రైతులు కొనుగోలు చేసే డీఏపీ, ఫాస్పటిక్, పొటాసిక్ ఎరువులపై రూ. 51,875 కోట్ల రాయితీని అందించనున్నట్లు తెలిపింది. దీని వల్ల రైతులందరికీ అవసరమైన ఎరువులు ఇబ్బందులు లేకుండా అందుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆమోదిత ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు రాయితీ మొత్తం విడుదల అవుతుందని, వారు రైతులకు అందుబాటు ధరలో ఎరువులను సరఫరా చేస్తారని కేంద్రప్రభుత్వం వెల్లడించింది.