తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. మంగళవారం ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్తో భేటీ అయ్యారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలు, ప్రాంతీయ పార్టీలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలపై మాట్లాడుకొన్నట్టు తెలిసింది. ముందుగా, కుటుంబంతో కలిసి సీఎం కేసీఆర్ చన్నైలోని ఆళ్వార్పేట్లో ఉన్న స్టాలిన్ నివాసానికి వెళ్లారు. నివాసం వద్దకు చేరుకోగానే ఇంటి బయటకు వచ్చిన స్టాలిన్.. కేసీఆర్కు శాలువా కప్పి, కుటుంబ సభ్యులందరినీ సాదరంగా ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులందరినీ సీఎం కేసీఆర్కు పరిచయం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను స్టాలిన్ కుమారుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్, కేసీఆర్ కుటుంబ సభ్యులు, తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు ఆప్యాయంగా పలుకరించుకొన్నారు. అనంతరం ముఖ్యమంత్రులిద్దరూ ఏకాంతంగా గంట సేపు చర్చించుకొన్నట్టు తెలిసింది. ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై మాట్లాడుకొన్నట్టు సమాచారం. కేంద్ర వ్యవసాయ విధానాలు సరిగా లేవని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని చర్చించుకొన్నట్టు తెలిసింది. ప్రజలకు ప్రాంతీయ పార్టీలే రక్ష అని అభిప్రాయపడ్డట్టు సమాచారం.
జాతీయ పార్టీలకు జాతీయ విధానాలే లేవని, ప్రాంతీయ పార్టీలకే ప్రజలపై శ్రద్ధ ఉన్నదని, అందుకే ప్రజలు వాటినే ఆదరిస్తున్నట్టు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, కాళేశ్వరంపై స్టాలిన్కు కేసీఆర్ వివరించినట్టు సమాచారం. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర రైతుల గోసను లోక్సభ,రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తిన తీరు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల పరిహారం విషయాలపై మాట్లాడినట్టు తెలిసింది. దాంతోపాటు రెండురాష్ర్టాల్లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురూ చర్చించినట్టు సమాచారం.తెలంగాణలో శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రస్తావించి, కేసీఆర్కు అభినందనలు తెలిపినట్టు తెలిసింది. బుధవారం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైలోనే ఉండనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, దక్షిణ భారతదేశంలో బలమైన, జన హృదయ నేతలతో కలిసి సమావేశం కావటం ఆనందంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అద్భుతమైన ఆతిథ్యాన్నిచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్కు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.