Crime మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో మద్యం పంచగా… వాటిని తాగిన వ్యక్తుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్లోని ఫుల్గఢ్, శివగఢ్ గ్రామాల్లో శనివారం చోటుచేసుకున్నట్లు అధికారుల వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ఈ గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఓ అభ్యర్థి మద్యం పంపిణీ చేశారు. ఈ మందు తాగిన వారిలో ఐదుగురు మరణించగా… మరికొందరు అస్వస్థతకు గురైనట్లు హరిద్వార్ సీనియర్ ఎస్పీ యోగేంద్ర యాదవ్ వెల్లడించారు.
మృతులు…ఫుల్గఢ్ గ్రామానికి చెందిన రాజు, అమర్పాల్, భోలాలు తో పాటు… శివగఢ్కు చెందిన మనోజ్, కాకా అనే వ్యక్తులుగా పోలీసులు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురై పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తిస్తూ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా…స్థానిక పాథ్రి ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అయితే… ఈ మరణాలకు కల్తీ మద్యం కారణం కాదని హరిద్వార్ జిల్లా న్యాయమూర్తి తన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టు సీం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై హరిద్వార్ సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ పూర్తిస్థాయి విచారణ జరిపి..15 రోజుల్లో నివేదిక ఇస్తారని పేర్కొంది. కాగా… 2019లో కల్తీ మద్యం తాగి హరిద్వార్లోని 5 గ్రామాల్లోని 40 మంది మృతి చెందిన ఘటన అప్పట్లో తీవ్ర విషాదం మిగిల్చింది.