సాధారణంగా ఏదైనా ఒకదాన్ని కనిపెట్టాలంటే ఎంతో చదువుకుని, ఎంతో విజ్ఞానాన్నీ, అనుభవాన్నీ సంపాదించిన సైంటిస్టులకు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ, ఒక దినసరి కూలీ వాయిస్ కమాండ్ తో పనిచేసే రోబోను తయారు చేసి టెక్ దిగ్గజాలకు సైతం దిమ్మ తిరిగేలా చేశాడు. అది ఎక్కడో కాదు, మన దేశంలోనే…!
దక్షిణ గోవాలోని పొండా తాలూకా బితోరా గ్రామానికి చెందిన నలభయ్యేళ్ల వయసుగల బిపిన్ కదమ్ కు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. స్వయంగా భోజనం కూడా తినలేని కుమార్తెను చూసి బిపిన్ ఎంతగానో బాధపడేవాడు. ఆమె బాగోగులన్నీ భార్యే చూసుకునేది. అయితే, రెండేళ్ల క్రితం ఆమె కూడా మంచం పట్టింది. దీంతో కుమార్తెకు అన్నం తినిపించేవారు కరవయ్యారు. దినసరి కూలీ అయిన బిపిన్ ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికి చేరుకునేవాడు. ఇలాగైతే లాభం లేదని కుమార్తెకు అన్నం తినిపించేందుకు రోబో ఏమైనా దొరుకుతుందేమోనని మార్కెట్లో వాకబు చేశాడు. అలాంటిదేమీ లేకపోవడంతో ఇక లాభం లేదని, తానే ఆ పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.
పెద్దగా చదువుకోని బిపిన్ నాలుగు నెలల్లోనే పరిశోధన తర్వాత కూలీకి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికొచ్చాక రోబోను తయారు చేయడం ఎలా అన్నదానిపై నాలుగు నెలలపాటు పరిశోధన చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుని, దానిపై అవగాహన పెంచుకున్నాడు. దాని సాయంతో నాలుగు నెలలు కష్టపడి ఓ రోబోను తయారుచేశాడు. పూర్తిగా వాయిస్ కమాండ్తో పనిచేసే దీనికి ‘మా రోబో’ అంటే తల్లి రోబో అని పేరు పెట్టాడు.
దాని చేతిలో ఆహారం వున్నన్న పళ్లెం పెడితే అది కలిపి కుమార్తెకు తినిపించేలా డిజైన్ చేశాడు. అంతేగాదు, వాయిస్ కమాండ్ ద్వారా ఆహారాన్ని ఏ కూరతో కలిపి తినిపించాలో చెబితే రోబో అదే చేస్తోంది.
ఈ రోబో విజయవంతంగా పని చేస్తుండడంతో బిపిన్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. విషయం వెలుగులోకి రావడంతో గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బిపిన్పై ప్రశంసలు కురిపించింది. ఆయన తయారు చేసిన ‘మా రోబో’ను వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. అద్భుతం గదూ… అందుకే, అవసరమే లక్ష్యంగా మారితే దాన్ని ఏ అవరోధాలూ ఏమీ చేయలేవు.