‘యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతా’, ‘స్త్రీ, పురుషులు సమానమే’… అనే మాటలు వినడానికీ, చదువుకోవడానికీ బావుంటాయి. కానీ, అనేకానేక కారణాలవల్ల స్త్రీలు కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రంగాల్లో అందలమెక్కలేకపోతున్నారన్నది నిర్వివాదాంశం. ఇటలీలో కూడా ఇదే జరిగింది. ఇటలీకి ఇప్పుడు ప్రధాని పీఠాన్ని ఒక మహిళ అధిష్టించబోతున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీకి మహిళ ప్రధాని కావడం ఇదే మొదటిసారి. ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే పార్లమెంటు ఉభయ సభల్లోనూ నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీయే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఇటలీలో రాజకీయ సుస్థిరతకు తాజా ఎన్నికలు వీలు కల్పించాయి. అయితే, కొత్త ప్రధానికి ఎన్నో సవాళ్లు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తర్వాత ఇంధన ధరల మంటను ఇటలీ ఎక్కువగా చవిచూస్తోంది. యూరోప్ లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వీటిని ఆమె సరిదిద్దాల్సి ఉంది.
‘మనం ఆరంభ స్థాయిలోనే ఉన్నాం. రేపటి రోజు నుంచి మనం ఏంటో నిరూపించుకోవాల్సి వుంది.’ అని 45 ఏళ్ల జార్జియా మెలోనీ తన పార్టీ మద్దతుదారులతో పేర్కొన్నారు. సో, ఈ లెక్కన చూస్తే మనదేశం చాలా చాలా బెటరేం గదూ…!!