Ap State Capital : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి జరుగుతున్న పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఇప్పుడు ఆ పిటిషన్ పై విచారణలో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ. లలిత్ నేతృత్వం లోని త్రిసభ్య ధర్మాసనం ముందు కేసు విచారణ జరగాల్సి ఉందని సమాచారం. అయితే ఈ కేసు విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసు విచారణ నుంచి వైదొలగుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ. లలిత్ తెలిపారు. దీంతో వేరే బెంచ్ ముందు విచారణ చేయాలని… వీలైనంత త్వరగా విచారణకు అనుమతివ్వాలని జస్టిస్ లలిత్ కోరారు.
ఒకేచోట నిధుల కేంద్రీకరణతో ప్రాంతీయ అసమానతల పెరిగే అవకాశం ఉందని, విభజన చట్టం, రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానికే సర్వాధికారం ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు అవసరం అని, రాజధాని వికేంద్రీకరణ ఖర్చు రూ.2000 కోట్ల రూపాయలు మాత్రమే అని ప్రభుత్వం చెబుతోంది. వికేంద్రీకరణ తమ విధానమని, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూలు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తోంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది. కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోవడం లేదని ప్రభుత్వం వాదిస్తోంది.
మరోవైపు ప్రభుత్వ వాదనపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసా గించాలని రైతులు కోరుతున్నారు. ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందని ఆరోపిస్తున్నారు. విభేదాలు సృష్టించేందుకే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.