Kartikeya Gummakonda : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ (Kartikeya Gummakonda).. చివరిగా 2021 లో ‘రాజా విక్రమార్క’ సినిమాతో హీరోగా ఆడియన్స్ ని పలకరించాడు. ఆ తరువాత 2022 లో తమిళ్ సినిమా ‘వలిమై’లో విలన్ గా కనిపించాడు. ఇప్పటి వరకు ఈ హీరో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. గత ఏడాది ఎండ్ లో ‘బెదురులంక 2012’ సినిమాని ప్రకటించిన ఈ హీరో.. ఇప్పుడు ఆ చిత్రాన్ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. కొత్త దర్శకుడు క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2012 లో జరిగిన అతిపెద్ద మోసం నేపథ్యంతో ఉండబోతుంది.
2012లో యుగాంతం రాబోతుంది అంటూ ప్రపంచవ్యాప్తంగా అప్పటిలో భారీ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు అన్ని న్యూస్ ఛానల్స్ ప్రసారం చేయడం, దాని పై ఒక సినిమా రావడం కూడా జరిగింది. ఇక ఆ సమయంలో దానిని నమ్మి భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. గోదావరి బెదురులంకకి చెందిన గ్రామస్తులు ఆ ప్రచారం నమ్మి ఎటువంటి పరిస్థితులు ఎదురుకున్నారు అనే అంశాన్ని పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా చూపించనున్నారు.
ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది. కొత్త కంటెంట్, బ్యూటిఫుల్ విజువల్స్ తో ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనుంది. ఇక ఈ అతిపెద్ద మోసాన్ని ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీలో కార్తికేయ సరసన నేహా శెట్టి నటిస్తుంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.