Rahul Bharath Jodoyatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోదో యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువతీ యువకులు పెద్ద ఎత్తన పాల్గొంటున్నారు. కాగా రాహుల్ను కలిసేందుకు జనం పోటెత్తుతుండడంతో తోపులాటలు జరుగుతున్నాయి. ఈ క్రమం లోనే పాదయాత్రలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్కి గాయం అయ్యింది. రాహుల్తో కలిసి నడుస్తుండగా తోపులాట జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకొనిరావడంతో… రౌత్ కంటికి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తుంది. దీంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాతబస్తీలో రాహుల్ పాదయాత్ర భారత్ జోడో యాత్రకే హైలైట్గా నిలిచింది. పాతబస్తీ వీధులన్నీ జనసంద్రంగా మారాయి. చార్మినార్ పరిసరాలు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. పాదయాత్ర ఆద్యంతం సిటీలో రాహుల్కు ఘన స్వాగతం లభించింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే కాంగ్రెస్ చీఫ్గా తొలిసారి హైదరాబాద్ వచ్చారు. గతంలో రాజీవ్ సైతం చార్మినార్ నుంచే సద్భావన యాత్రను ప్రారంభించారని స్మరించుకుంటూ రాజీవ్ చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారు.
పాదయాత్రలో రాహుల్ ను కలిసే క్రమంలో ఓ వృద్ధురాలు కిందపడిపోయింది. ఆమెను చేయి పట్టి లేపి నీళ్లు అందించారు రాహుల్. ఆపై దగ్గరకి తీసుకుని ఆమెకు సపర్యలు చేశారు. ఆమెకు చెప్పులు తన చేతులతో అందించారు. రాహుల్ సపర్యలకు సదరు మహిళ చేతులెత్తి మొక్కింది. అలానే బీజేపీ-టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని రాహుల్ విమర్శించారు. పార్లమెంట్లో ఎన్నోసార్లు బీజేపీ-టీఆర్ఎస్ కలిసి పని చేశాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలు రాగానే రెండు పార్టీలూ డ్రామాలకు తెరదీస్తాయన్నారు రాహుల్. కేసీఆర్ ఫోన్ చేస్తే మోదీ వెంటనే స్పందిస్తారంటూ ఎద్దేవా చేశారు.