జర్నలిజం మరియు కమ్యూనికేషన్ విభాగంలో తన పీహెచ్ డీ లో భాగంగా చేసిన పరిశోధనకు గాను బంగారు పతకం పొందిన తన ప్రజా సంబంధాల అధికారి మాణిక్య మహేష్ ను మంత్రి మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా “గ్రామీణ అభివృద్ధిలో కమ్యూనికేషన్ వ్యూహాల మూల్యాంకనం”అనే అంశం పైన ప్రొఫెసర్ వి సత్తిరెడ్డి ఆధ్యర్యంలో పరిశోధన చేసి సమర్పించిన పరిశోధన గ్రంథానికి డాక్టరేట్ డిగ్రీ తో పాటు బంగారు పతకాన్ని తెలుగు యూనివర్సిటీ ప్రదానం చేసింది. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధిని ప్రజల వద్దకి మరింత వేగంగా, సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన కమ్యూనికేషన్ వ్యూహాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మహేష్ తన అధ్యయనంలో గుర్తించారు.
ఈ పరిశోధనకు నిన్న రవీంద్రభారతిలో జరిగిన తెలుగు విశ్వవిద్యాలయ 15వ స్నాతకోత్సవంలో భాగంగా గవర్నర్ తమిలి సై సౌందర్యరాజన్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని యూనివర్సిటీ అందించింది. ఈ నేపథ్యంలో తన ప్రజా సంబంధాల అధికారి మహేష్ ని ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆయన చేసిన పరిశోధనా తాలూకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టరేట్ డిగ్రీ తో పాటు ప్రత్యేకంగా బంగారు పథకాన్ని పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జర్నలిజం మరియు కమ్యూనికేషన్ రంగంలో తన అధ్యయనాన్ని ఇంతే నిబద్ధతతో కొనసాగించాలని సూచించారు.