తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ప్రసంగం – ముఖ్యాంశాలు
• మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి గారితో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కదిలి వచ్చిన సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు.
• స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయలంటే త్యాగం
• స్వాతంత్ర్యనాంతరం ప్రధానమంత్రి నెహ్రూ గారి ఆధ్వర్యంలో, బిఆర్ అంబేద్కర్ గారి మార్గనిర్దేశనంలో మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని, చక్కటి ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాం.
• ఈ దేశం ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.
• ఆ తర్వాత రాజకీయాల్లో, ప్రజా జీవితంలో అనేక మార్పులు సంభవించి నేడు మన కళ్ల ముందున్న సమాజాన్ని మనం చూస్తున్నాం.
• నాకు అవగాహన కలిగినటువంటి భారతదేశం ఏ దశకు చేరుకోవాలో చేరుకోలేదు
• ప్రజల కోరిక, స్వాతంత్ర్య ఫలం పూర్తిగా సిద్ధించలేదు.
• అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే సాగు భూములు ఉన్నాయి.
• చైనాలో 16 శాతం మాత్రమే సాగు భూమి ఉంది.
• కానీ మన దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. 83 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో రమారమి 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది.
• మన దేశంలో ప్రతి ఏడాది ఒక లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తోంది. ఇది సాక్షాత్తు కేంద్రం చెబుతున్న లెక్క. 70 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉంది.
• భూమి, సోలార్, పర్యావరణ మండలాలు ఉన్నాయి. పని చేసేటటువంటి మనషులు ఉన్నారు.
• మూడు రకాల వాతావరణ మండలాలు మన దేశంలో ఉన్నాయి. 70 వేల టిఎంసిల నీరు మనదేశంలో అందుబాటులో ఉంది.
• భూమి ఉంది, సూర్య శక్తి, పంటలు పండడానికి కావాల్సిన పర్యావరణ మండలాలు, మానవ వనరులు ఉన్నాయి.
• తగిన పద్ధతిలో వ్యవహారం చేస్తే భారతదేశం అద్భుతమైన ఫుడ్ చైన్ కలిగిన దేశంగా ఉండాలి.
• కానీ భారతదేశ రైతులు దేశంలో ఉద్యమాలు చేస్తున్నారు.
• లక్ష కోట్ల విలువైన పామాయిల్ ను మనం దిగుమతి చేసుకుంటున్నాం.
• సంపద ఉండి, అద్భుతమైన మానవ వనరులుండి మనం ఈ దుస్థితిలో ఎందుకున్నాం
• ప్రజా జీవితంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఇది ఆలోచించాలి.
• బిఆర్ఎస్ ఏదో తమాషా కోసం కాదు. బిఆర్ఎస్ ఫర్ ఇండియా.
• ఖచ్చితంగా లక్ష కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది
• మనదేశంలో అన్ని రకాల విద్యుత్ కలిపితే దాదాపు 4 లక్షల 10 వేల 100 మెగావాట్లు స్థాపిత విద్యుత్ సామర్థ్యముంటుంది. దాన్లో రెండు లక్షల మెగావాట్లు కూడా వాడడం లేదు
• వనరులు, వసతులు ఉండి ఈ దేశ ప్రజలు ఎందుకు వంచించబడాలి? ఎందుకు శిక్షించబడాలి ?
• ఈ పరిస్థితి ఇలాగే ఉండాలా ? మార్పు రావాలా ?
• ఏ విషయాన్ని ప్రారంభించినా మొదట ఎదురయ్యేది అవహేళనే. మహాత్మాగాంధీ గారి లాంటి మహానుభావులు కూడా ఇదే చెప్పారు.
• మహోజ్వల భారత్ నిర్మాణం కోసమే బిఆర్ఎస్
• రానున్న రోజుల్లో అద్భుతంగా ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి.
• ఇది చిల్లరమల్లర రాజకీయం కాదు.
• ఢిల్లీలో బిఆర్ఎస్ గురించి నన్ను అడిగిన ఓ జర్నలిస్టును ఈ రోజు మనదేశం లక్ష్యం ఏమిటని అడిగాను.
• చివరికి మన దేశం లక్ష్యం ఏమైంది? ఏం చేసైనా సరే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం
• కులాల కుంపట్లు, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నాలు చేయడమే కొన్ని రాజకీయ పార్టీల లక్ష్యమైంది.
• ఈ రోజు దేశంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా?
• రైతాంగం ఢిల్లీలో ధర్నాలు చేశారు. వందలమంది చనిపోయారు. కానీ ఎవరూ పట్టించుకున్నవారు లేరు.
• ఎందుకీ మూగ రోదన .. మూగ వేదన…అసంతృప్తి..?
• బిసి వర్గాల్లో ఉండే ప్రజలు తమను వేరే గ్రూపులో చేర్చమంటున్నారు. రజకులు తమను ఎస్సీల్లో చేర్చమంటూ దరఖాస్తులు పెడుతున్నారు. జీవితంలో మార్పు రావాలనే పాకులాట ఇది.
• దేశంలో అనేక రంగాల్లో పనిచేసిన నిష్ణాతులైన వారు కోకొల్లలు ఉన్నారు
• కానీ నేటి రాజకీయ నాయకులు వారితో చర్చించరు.
• బిఆర్ఎస్ పార్టీ ఆలోచనపరులను ఏకం చేస్తున్నది.
• మనకు తెలియనిది తెలియదని ఒప్పుకుని నేర్చుకుంటేనే ముందుకు పోతాం.
• నేల విడిచి సాము చేసే నాయకత్వాన్ని మనం చూస్తున్నాం.
• వ్యక్తులు కాదు వ్యవస్థీకృతంగా పనులు జరగాలి
• దేశంలో కరెంటు ఉంటుంది. కానీ ప్రజలకు అందదు.
• మొత్తం వ్యవస్థకు పనికి వచ్చే పనులకు రూపకల్పన జరిగి, వాటి ఫలితాలను ప్రజలను అనుభవించాలి.
• బ్రహ్మండంగా అభివృద్ధి చెందిన సింగపూర్ కు చివరకు మంచినీళ్ళు కూడా లేవు.
• ఏమీలేని సింగపూర్ అంతలా అభివృద్ధి చెందితే అన్నీ ఉన్న భారతదేశం ఇంకెంత అభివృద్ధి చెందాలి?
• ఈ మధ్యే సింగపూర్ లో బడ్జెట్ మిగిలిందని ప్రజలకు పంచి పెట్టారు.
• 1980 వరకు కూడా చైనా జిడిపి భారతదేశం కంటే తక్కువ.
• నేడు చైనా ఎక్కడి నుంచి ఎక్కడకు పోయింది. నేడు చైనా లేకుంటే ప్రపంచమే లేదనే పరిస్థితి నెలకొంది.
• కానీ గొంతు చించుకొని మేకిన్ ఇండియా అంటున్నారు. మేకిన్ ఇండియాతో ఏమొచ్చింది. మీరంతా ప్రత్యక్ష సాక్ష్యులు.
• మేకిన్ ఇండియా నిజమైతే గల్లీ గల్లీకి చైనా బజారుంటుందా?
• మరి భారత్ బజార్ ఎక్కడ పోయింది.
• సమాజం ఎప్పుడు జాగృతమవుతుందో అప్పుడు వంద శాతం ఫలితాలు వస్తాయి.
• మన దేశంలో 65 వేల నుంచి 70 వేల టిఎంసిల నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. మరో 4 లేదా 5 వేల టిఎంసీల నీళ్ళు అంతర్జాతీయ తగాదాల్లో ఉన్నాయి.
• మరి దేశంలో నీటి యుద్ధాలెందుకు ?
• బ్యాడ్ వాటర్ పాలసీ కారణంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం. బ్యాడ్ పవర్ పాలసీ కారణంగా విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాం.
• మరి తెలంగాణలో విద్యుత్ వెలుగులు ఎలా విరజిమ్ముతున్నాయి.
• తపన పడాలి. తండ్లాడాలి. అప్పుడు తప్పకుండా ఇది సాధ్యమవుతుంది.
• నెపాలు చెప్పేవారు నాయకులు కాదు.
• మంచినీళ్ళ కోసం ప్రజలు ఎందుకు బాధపడాలి ?
* చెన్నై అనే మహా నగరానికి నీటి తండ్లాట ఏంది.
• చైనా దేశలో యాంగ్జి అనే నది ఉంటుంది. 1000 టిఎంసిల నీటిని అక్కడ తరలిస్తున్నారు.
• ప్రపంచంలోనే 6600 టిఎంసిల కెపాసిటి కలిగిన అతిపెద్ద నీటి రిజర్వాయర్ జింబాంబ్వే అనే దేశంలో ఉంది.
• దాదాపు రష్యాలో కూడా 5 వేలు, 4వేలు, 3 వేల టిఎంసిల నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులున్నాయి.
• చైనాలో 1450 టిఎంసిల సామర్థ్యం కలిగిన త్రీ గార్జెస్ డ్యామ్ ఉంది.
• భారతదేశం అతివృష్టి, అనావృష్టిని చవి చూసింది.
• భారతదేశం లాంటి అద్భుత సంపద కలిగిన దేశం ఎందుకు వెనుకబడి పోయింది ? మనదేశంలో కూడా ఇలాంటి డ్యామ్ లు ఉండకూడదా..?
• చాలా సులభంగా పరిష్కరించగలిగే సమస్యలను కూడా పరిష్కరించలేదు
• ఎన్నికలొస్తే గోల్ మాల్ చేసి, గెలిచినంక ఎవరి దారి వారు పోతరు.
• దేశ రాజధాని ఢిల్లీలో కూడా చాలినంత నీటి లభ్యత లేదు
• ఢిల్లీ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కరెంటు కోతలున్నాయి.
• అనేక తరతరాలు వివక్షకు గురైన దళిత బిడ్డలు నేటికీ ఇలాగే ఉండాలా ?
• ఇలాంటి సమస్యల పరిష్కారం కోసమే బిఆర్ఎస్
• ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు కానీ పార్టీలు గెలుస్తున్నయ్. నాయకులు గెలుస్తున్నారు
• ఏ ఆశతో ప్రజలు గెలపిపిస్తున్నరో అవి నెరవేరటం లేదు.
• భారతదేశం బుద్ధిమంతుల దేశం. బుద్దుగాళ్ళ దేశం కాదు.
• ఈ విషయాలను స్పష్టంగా చెప్పగలిగితే భారతదేశం స్పందిస్తుంది.
• పవర్ ఫుల్ అనుకున్న ఇందిరాగాంధీని ఈ దేశ ప్రజలు ఓడిపించారు. గెలిచినవాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ వారిని ఓడించి ఇందిరా గాంధీని గెలిపించారు.
• ఎలక్షన్ ఒక ప్రాసెస్. ఎన్నికలు వస్తాయి. పోతాయి.
• చిత్తశుద్ధి, వాక్ శుద్ది ఉంటే మనం గెలిచి తీరుతాం.
• రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం మతచిచ్చులు పెడితే దేశం ఎటు పోతుంది.
• మనం ఇదంతా చూస్తూ ఉండాలా. ?
• మీ బిడ్డగా, భారతీయుడిగా మిమ్మల్ని ప్రార్థించేది ఒక్కటే
• మనం పురోగమిస్తూ పోతే శక్తి సంక్రమిస్తూనే ఉంటుంది. ముందుకు పోతూనే ఉంటాం.
• ఆంధ్రప్రదేశ్ లో కూడా అసలైన ప్రజా రాజకీయాలు ప్రారంభం కావాలె.• గోల్ మాల్ ల నుండి దేశాన్ని బయటపడేసేందుకే బిఆర్ఎస్
• భారతదేశంలోని అన్ని గ్రామాల్లో మన పార్టీ కమిటీలు ఏర్పాడాలి.
• దేశంలోని అన్ని నియోజకవర్గాలకు మనం విస్తరించాలి.
• కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, పశ్చిమ కనుమల నుంచి తూర్పు కనుమల దాకా మనం విస్తరించాలి.
• తెలియని విషయాలు తెలుసుకుంటూ అధ్యయనం చేస్తూ ముందుకు సాగాలి.
• ఏమీ లేని సింగపూర్, సౌత కొరియా, మలేషియా, జపాన్ లాంటి దేశాలు పురోగమించినప్పుడు మనం ఎందుకు వెనుకబడి పోయాం.
• మనం ఒక అర్థంలేని ఒరవడిలో పడి కొట్టుకుపోతున్నం. అది ఆగాలి.
• రాజకీయాలు ఆటలా తయారయ్యాయి. కానీ అది సరికాదు
• రాజకీయాలు అనేవి ఒక టాస్క్ లాంటివి.
• అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతేనే అభివృద్ధి. కానీ చిన్న చిన్న మార్పులను కూడా మనదేశం లో చూస్తలేం.
• ప్రగతి గమనంలో ఎదురైన నిరోధాలను ఎప్పుడో నిర్మూలించి ఉండాల్సింది.
• ఎన్నికలు గట్టెక్కడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి.
• ఈ సమస్యల నుంచి ప్రజలను బయపడేసే లక్ష్యంతోనే బిఆర్ఎస్ పార్టీ పుట్టింది. బిఆర్ఎస్ పార్టీ ఏకైక లక్ష్యం ఇదే.
• మహాత్మాగాంధీ, భగత్ సింగ్ లాంటి వారు మాకెందుకులే అనుకుంటే నేడు స్వాతంత్ర్యం వచ్చేది కాదు.
• ఎక్కడో ఒక అడుగు పడాలి.
• నీళ్ళు ఉంటాయి కానీ పొలాలకు పారవు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ?
• బిఆర్ఎస్ కు అధికారం ఇస్తే రెండేళ్ళలో భారతదేశాన్ని వెలుగుజిలుగులతో నింపుతాం.
• రైతులకు 24 గంటల ఉచిత్ విద్యుత్ ఇవ్వడం అసంభవమా.. ఆ మాత్రం డబ్బు కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా.. అందుకయ్యే ఖర్చు 1 లక్ష 45 వేల కోట్లే.
• దళిత ప్రజల్లో రత్నాలు, వజ్రాల్లాంటి వ్యక్తులున్నారు . సరైన ప్రోత్సాహం లేక వెనుకబడిపోతున్నారు. తెలంగాణలో వారికెన్నో రకాల రిజర్వేషన్లు కల్పించాం.
• బిఆర్ఎస్ ను బలపర్చి గెలపిస్తే దేశవ్యాప్తంగా ఉచిత కరెంటు, దళిత బంధును అమలు చేస్తాం. వీటి కోసం సంవత్సరానికి రెండన్నర లక్షల కోట్లు ఖర్చవుతాయి.• విశాఖ ఉక్కును ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమ్మినా…. దాన్ని తిరిగి తీసుకొని పబ్లిక్ సెక్టార్ లోకి తీసుకొస్తాం.
• లక్షల కోట్ల ప్రభుత్వ రంగ ఆస్తులను వేల కోట్లకు అమ్ముకుంటున్నారు. వీటిని నిరోధించడనికి, ప్రశ్నించడానికి పుట్టిందే బిఆర్ఎస్.
• ప్రధానమంత్రిగారు అమ్మేయాలనుకుంటే అమ్మేయండి మేం వాటిని తిరిగి తీసుకుంటాం.
• బిఆర్ఎస్ ఫర్ ఇండియా.
• ఈ దేశంలో ప్రబలమైన మార్పు కోసం జరిగే యజ్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ముందుకు రావాలి.
• బిఆర్ఎస్ లో పనిచేసే వాళ్ళు స్వతంత్ర పోరాటంలో ఎలాంటి గౌరవం దక్కిందో అలాంటి గౌరవం దక్కుతుందని నేను చెప్తున్నా.
• బిజెపిది ప్రైవేటైజేషన్ మాది నేషనలైజేషన్
• సంక్రాంతి తర్వాత ఏడెనిమిది రాష్ట్రాల్లో బిఆర్ఎస్ పనులు వేగవంతం చేస్తుంది.
• కిషోర్ గారు అద్భుతమైన ప్రతిభాపాటవాలున్న వ్యక్తి. వారి సేవలను పార్టీ వినియోగించుకుంటుంది.
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిఆర్ఎస్ అధ్యక్షునిగా నేను తోట చంద్రశేఖర్ గారిని నియమిస్తున్నాను. వారి కర్తవ్య నిర్వహణలో వారు విజయం సాధించాలనీ, వారు తప్పక విజయం సాధిస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
• అనేక సంఘాలు, సమాజాల నుండి వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి.
• చాలా మందికి ఆశ్చర్యం కలిగించే చేరికలు భవిష్యత్ లో జరగనున్నాయి.
• ఓర్వలేని వాళ్ళు, తమ పీఠాల కింద నీళ్ళు వస్తాయని భావించే వాళ్ళను లెక్కచేయకుండా మనం ముందుకు సాగాలి.
• మనం పోతుంటే ప్రజలు మన వెనకాలే వస్తారు.
• తప్పకుండా మనం లక్ష్యాన్ని చేరుకుంటాం.